పెద్దఅంబర్పేట, మే 15 : పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునేవరకూ ఏ పిల్లల చేతుల్లో చూసినా సెల్ఫోన్లే దర్శనమిస్తున్నాయి. పక్కవారు పిలుస్తున్నా కనీస స్పృహ లేకుండా ఫోన్ స్క్రీన్లలో మునిగిపోతున్నారు. కొందరు పిల్లలకు ఇది మరీ వ్యసనంగా మారుతున్నది. ఇక వేసవి సెలవులు వచ్చిన ప్రస్తుత తరుణంలో సెల్ఫోన్ల వినియోగం మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో సెలవు రోజుల్లో చిన్నారులకు ఎన్నో శిక్షణలు ఇప్పించొచ్చని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. 30 రోజుల సెలవుల్లో పిల్లల భవితకు పునాదిగా నిలిచేలా విభిన్న రంగాల్లో శిక్షణలకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పిల్లల ఆసక్తికి తగ్గట్టు ట్రైనింగ్లు ఇప్పిస్తే.. వారు భవిష్యత్లో రాణించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
పొద్దున లేవగానే ఫోన్లు పట్టుకోవడం, టీవీల ముందు కూర్చోవడం, ఇక స్మార్ట్ టీవీల్లో ఇంటర్నెట్ కనెక్షన్తో అంతర్జాలాన్ని ఏలేద్దాం అనేలా తయారయ్యారు పిల్లలు. అయితే, వీటిని దూరం పెట్టాలని వివిధ రంగాల కోచ్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్న తరుణంలో ఉదయం ఇండోర్ గేమ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
చెస్, క్యారమ్స్ వంటి ఆటలపై శిక్షణలు ఇప్పిస్తే బాగుంటుందని చెబుతున్నారు. షెడ్యూల్ సిద్ధం చేసుకుని.. అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. పిల్లల మేధస్సుకు పదునుపెట్టేలా శిక్షణలు ఉండాలని పేర్కొంటున్నారు.
పిల్లలకు హ్యాండ్ రైటింగ్, కర్సివ్ రైటింగ్లో తర్ఫీదు ఇవ్వాలి. గణితంలో మెళకువల కోసం అబాకస్ వంటి శిక్షణలు ఇప్పించాలి. పిల్లలు ఆసక్తి కనబరిస్తే సింగింగ్, వెస్టర్న్ డ్యాన్స్ నేర్పించాలి. ఇండోర్ యాక్టివిటీస్తో పాటు డ్యాన్స్, యోగా, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, తైక్వాండో, కరాటే తదితర రంగాల్లో కోచింగ్లకు అవకాశం ఉంటుంది. నగర శివారుల్లో అనేక సమ్మర్ క్యాంప్లు వెలుస్తున్నాయి.
ప్యాకేజీలతో అక్కడ నాలుగైదు శిక్షణలు అందుబాటులో ఉంటున్నాయి. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలపై పట్టు సాధించేందుకు శిక్షణలు సైతం ఇస్తున్నారు. ఆటలతోపాటు ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్కు ప్రస్తుతం మంచి డిమాండ్ కూడా ఉన్నది.