ఇబ్రహీంపట్నం, మే 15 : నగరం చుట్టూ ఏర్పాటు చేసిన ఔటర్రింగ్రోడ్డు వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు పచ్చదనం కూడా ఉట్టిపడుతున్నది. ప్రభుత్వం నగరం చుట్టూ ఏర్పాటు చేసిన ఔటర్రింగ్రోడ్డు చుట్టూ పచ్చదనం పరిఢవిల్లుతుంది. హెచ్ఎండీఏ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్ వింగ్ ఆధ్వర్యంలో ఔటర్కిరువైపులా, సర్వీస్రోడ్డు పరిధిలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరుగడంతో ఔటర్పరిసర ప్రాంతాలు పచ్చదనంతో విరాజిల్లుతున్నాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్ంగలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గౌరెల్లి నుంచి ఇబ్రహీంపట్నం మండలంలోని రావిర్యాల వరకు ఔటర్ రింగ్రోడ్డు విస్తరించి ఉంది. ఈ ఔటర్ రింగ్రోడ్డు పరిధిలో బొంగులూరుగేటు వద్ద రెండు జంక్షన్లు కూడా ఉన్నాయి. బొంగులూరు జంక్షన్ వద్ద ఓఆర్ఆర్కు సువిశాలమైన ప్రాంతం ఉంది. సుమారు 20కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొంగుళూరు జంక్షన్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా మారింది.
ఓఆర్ఆర్ పరిధిలోని బొంగుళూరు గేటువద్ద ఏర్పాటు చేసిన జంక్షన్లు వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిలో ఉన్న ఈ రెండు జంక్షన్లలో రంగురంగుల పూల మొక్కలను నాటారు. దీంతో ఈ ప్రాంతం నుంచి వెళ్లే వాహనదారులు జంక్షన్ మధ్యలో కూర్చుని సేదతీరుతున్నారు. ఈ రెండు జంక్షన్లు హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారికి తలమానికంగా మారాయి.