తుఫాన్ ప్రభావంతో సోమవారం రోజంతా కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి జిల్లా జల సంద్రమైంది. మంగళవారం వరద ఉధృతి కొనసాగింది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి అలుగు దుంకాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. పొంగిపొర్లుతున్న వాగుల దగ్గర పోలీసులు రాత్రంతా జాగారం చేసి ఎవ్వరూ వాగు దాటకుండా జాగ్రత్త పడ్డారు. రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. వికారాబాద్ కలెక్టర్ నిఖిల పలుచోట్ల పొంగి పొర్లుతున్న వాగులను పరిశీలించారు. రహదారులపై నుంచి వరద పోటెత్తింది. పలుప్రాంతాల్లో పంట పొలాలు జలదిగ్బంధమయ్యాయి. వందల ఎకరాల్లో పత్తి, కంది, వరి తదితర పంటలు నీట మునిగాయి.
రంగారెడ్డి, సెప్టెంబర్ 28, (నమస్తే తెలంగాణ): తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలోని షాద్నగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమన్గల్లు ప్రాంతాల్లో కురిసిన జోరు వానతో చెరువులన్నీ నిండుకుండల్లా మారి అలుగుపారుతున్నాయి. మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది, శంకర్పల్లి మండలంలోని ప్రొద్దుటూరు తదితర గ్రామాల పరిధిలో వంతెన పైనుంచి మూసీ నది ప్రవహిస్తుండడంతో శంకర్పల్లి మండలంలోని పలు గ్రామాలకు సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు షాబాద్, మొయినాబాద్ మండలాల మీదుగా వెళ్లే ఈసీ వాగు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలోనూ కురిసిన భారీ వర్షాలకు సంబంధిత గ్రామాల పరిధిలోని వాగులన్నీ పొంగిపొర్లడంతో మంగళవారం సాయంత్రం వరకు రవాణా స్తంభించింది. భారీ వర్షాలతో జిల్లా అంతటా వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఈసీ వాగుతోపాటు మూసీ నది, ఇతర వాగుల వద్ద పోలీసులు గస్తీ నిర్వహించి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న వాగులను ప్రజలెవ్వరూ దాటకుండా చూశారు.
వందల ఎకరాల్లో పంట నష్టం …
భారీ వర్షాలతో జిల్లాలో ప్రధానమైన మూసీ నదితోపాటు ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటితోపాటు జిల్లాలోని చాలా గ్రామాల పరిధిలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పంట పొలాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద నీటితో జిల్లావ్యాప్తంగా వందల ఎకరాల్లో నీట మునిగింది. పత్తి, వరి పంటలతోపాటు కూరగాయలు, పూల పంటలకు సంబంధించి 900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు సంబంధిత అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రధానంగా పత్తి 150 ఎకరాల్లో నీట మునగగా, వరి 50 ఎకరాల్లో నీట మునిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేవిధంగా గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ప్రధానంగా కూరగాయలు, పూలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని ఫారూఖ్నగర్, చౌదరిగూడెం, మొయినాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో కలిపి 768 ఎకరాల్లో కూరగాయల, పండ్లు, పూల పంటలు నీట మునిగినట్లు అధికారులు తేల్చారు. ఎక్కువ మొత్తంలో టమాట, క్యాప్సికం, క్యాబేజీ, మిరప, వంకాయ పంటలు నీట మునిగినట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు వెల్లడించారు.
తుఫాను ప్రభావంతో జిల్లా అంతటా వర్షం దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా జిల్లాలో వర్షం కురిసింది. అయితే సోమవారం పొద్దుపోయిన తర్వాత జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అయితే జిల్లాలోని రాజేంద్రనగర్, ఫరూఖ్నగర్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్ మండలంలో 91.7 మి.మీ, ఫరూఖ్నగర్ 78.3, ఇబ్రహీంపట్నం 71.1, మంచాల 70.1, మహేశ్వరం 70.9, షాబాద్ 68.1, నందిగామ 71, కొందుర్గు 62.6, చౌదరిగూడ 59, కొత్తూరు 64.4, చేవెళ్లలో 46.1, మొయినాబాద్ 50.3, శంషాబాద్ 52.4, కడ్తాల్ 34.8, కేశంపేట 55.4, తలకొండపల్లి 44.2, ఆమనగల్లు 41.2, మాడ్గుల 31.8, యాచారం 44.8, అబ్దుల్లాపూర్మెట్ 58.7, హయత్నగర్ 57.4, సరూర్నగర్ 52.6, బాలాపూర్ 58.3, శంకర్పల్లి మండలంలో 29 మి.మీ వర్షపాతం నమోదైంది.
కూరగాయలు, పూల తోటల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి