జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
షాద్నగర్ పాఠశాలకు రూ.5 లక్షల నిధులు
పాఠశాలల్లో పారిశుధ్య పనులు ముమ్మరం
షాద్నగర్, ఆగస్టు 26 : ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నడుపాలని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. గురువారం షాద్నగర్ ప్రభుత్వ కుంట ఉన్నత పాఠశాలను సందర్శించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనారోగ్యాలను గుర్తించినా తక్షణమే కొవిడ్ వైద్య పరీక్షలు చేయించాలని చెప్పారు. పాఠశాలలోని తరగతి గదులతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి గదిని ప్రత్యేక రసాయనాలతో శుభ్రపరుచాలన్నారు. వచ్చే నెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతుండంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుంట పాఠశాలలో విద్యార్థుల అవసరాల కోసం నూతనంగా మరుగుదొడ్లను నిర్మిస్తామని, అందుకుగాను రూ.5 లక్షల జడ్పీ నిధులను విడుదల చేస్తున్నామని చెప్పారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు, శానిటైజర్ను అందుబాటులో ఉంచాలని సూచించారు.
పాఠశాలల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి
షాబాద్, ఆగస్టు 26 : పాఠశాలల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు అన్నారు. గురువారం షాబాద్లోని తెలంగాణ మోడల్ పాఠశాల, తాళ్లపల్లి ఉన్నత పాఠశాలలను సందర్శించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి నివేదిక తయారు చేసి తమకు అందజేయాలని చెప్పారు. ఆయన వెంట మండల విద్యాధికారి శంకర్రాథోడ్ ఉన్నారు.
పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలి
కడ్తాల్, ఆగస్టు 26 : ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలను వెంటనే శుభ్రం చేయాలని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. గురువారం కడ్తాల్లో ప్రభుత్వ బాలుర పాఠశాలను ఎంపీడీవో సందర్శించారు. మధ్యాహ్న భోజనం లో విద్యార్థులకు వేడి పదార్థాలు అందించేలా చూడాలన్నారు.
ప్రతి పాఠశాలను శుభ్రం చేయాలి
షాద్నగర్టౌన్, ఆగస్టు 26 : మున్సిపాలిటీలోని ప్రతి పాఠశాలను శుభ్రం చేయాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ కార్మికులకు సూచించారు.
పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు
షాద్నగర్రూరల్, ఆగస్టు 26 : ఎలికట్ట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను అనునిత్యం శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ సాయిప్రసాద్ తెలిపారు. గురువారం ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
కొందుర్గు, ఆగస్టు 26 : మండలంలోని మహాదేవ్పూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను గురువారం ఎంపీడీవో ఆంజనేయులు సందర్శించి పనుల పరిశీలించారు.
ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించాలి
కొత్తూరు, ఆగస్టు 26 : ప్రజాప్రతినిధులు తరచుగా పాఠశాలలను సందర్శించాలని ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులలో గురువారం ఎంపీపీ సమీక్ష నిర్వహించారు.
ఉపాధ్యాయులకు సూచనలు
ఆమనగల్లు, ఆగస్టు 26 : ఆమనగల్లు పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
భయపడకుండా విద్యార్థులను బడికి పంపించండి
నందిగామ, ఆగస్టు 26 : సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి గురువారం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి నందిగామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చెత్త, పిచ్చి మొక్కలను తొలగించే పనులను చేపట్టారు. తల్లిదండ్రులు విద్యార్థులను భయపడకుండా బడికి పంపించాలని తెలిపారు.
పాఠశాలల్లో ప్రారంభమైన పారిశుధ్య పనులు
కొత్తూరు రూరల్, ఆగస్టు 26 : పెంజెర్ల, ఇన్ముల్నర్వ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంఈవో కృష్ణయ్య ఆధ్వర్యంలో పారిశుధ్య పనులను ప్రారంభించారు.