ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 22 : నగరంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను అక్టోబర్ 1 నుంచి రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని విజయవాడ రహదారికి సమీపంలోని బాటసింగారంలో నెలకొల్పనున్నారు. పండ్ల మార్కెట్ సామర్థ్యం ఏటా పెరుగుతుండటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రమైంది. ఉదయం 8 గంటల తరువాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పండ్ల లారీలు నగరంలోకి అనుమతి లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తేవి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో పండ్ల మార్కెట్ను బాటసింగారానికి తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం బాటసింగారం సమీపంలో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్కును ఈ మార్కెట్కు కేటాయించారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మార్కెట్ విజయవాడ రహదారికి సమీపంలోనే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా అతి దగ్గరలో ఉండటం వలన ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పండ్ల లారీలు ఏ సమయంలోనైనా మార్కెట్కు వచ్చేందుకు సులువుగా ఉంటుంది. అలాగే, నగరంలోని చైతన్యపురి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీరనుంది. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పండ్ల మార్కెట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, చిరువ్యాపారులు, హమాలీలకు అనుకూలంగా మార్కెట్ను తీర్చిదిద్దారు. బాటసింగారంలో మార్కెట్ను ఏర్పాటు చేయడంవల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి.
44 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటు
బాటసింగారం సమీపంలో 44 ఎకరాల విస్తీర్ణంలోగల లాజిస్టిక్ పార్కులో నూతన పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.90 లక్షలతో ఈ మార్కెట్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రయ విక్రయాల కోసం లక్ష sft సామర్థ్యం గల గోదాములను నిర్మించారు. మామిడి సీజన్లో మరో 4ఎకరాల్లో తాత్కాలిక గోదాములు నిర్మించడానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పలు రాష్ర్టాల నుంచి కూడా మామిడి సీజన్లో పెద్దఎత్తున ఈ మార్కెట్కు దిగుబడి వస్తుండటంతో పక్కనే ఉన్న మరో 8 ఎకరాల్లో లీజుకు తీసుకుని ప్రత్యేక గోదాములను ఏర్పాటు చేసేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్, నాలుగు లేన్ల రోడ్డు సౌకర్యం కల్పించారు.
తీరనున్న రవాణా సమస్య
గడ్డిఅన్నారం మార్కెట్లోకి రాత్రి సమయంలో మాత్రమే వాహనాలకు అనుమతి ఉండేది. ఉదయం 8 గంటల తరువాత వచ్చిన వాహనాలన్నీ రాత్రి 10 గంటల వరకు నగరం బయటనే ఉండాల్సిన పరిస్థితి. బాటసింగారం పండ్ల మార్కెట్ నగర శివారుల్లో ఉండటం వలన ఈ ప్రాంతంలో ఎలాంటి రవాణా ఆంక్షలు ఉండవు. పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎప్పుడైనా ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మార్కెట్లోకి రావడానికి అవకాశం ఏర్పడింది. బెంగళూరు, ముంబయి, విజయవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్రోడ్డు మీదుగా పెద్దఅంబర్పేట్ ఎగ్జిట్ వద్ద దిగి పండ్ల మార్కెట్కు చేరుకోవచ్చు.
అక్టోబర్ 1న ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాటసింగారం వద్ద ఏర్పాటుచేసిన నూతన పండ్ల మార్కెట్ను అక్టోబర్ 1న ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రస్తుతమున్న గడ్డిఅన్నారం మార్కెట్ వ్యాపారులంతా అక్టోబర్ 1 నుంచి బాటసింగారం మార్కెట్ నుంచి లావాదేవీలు కొనసాగించాలని ఆదేశాలు జారీచేశారు. ఈలోగా నూతన మార్కెట్లో వ్యాపారులకు గోదాముల్లో స్థలం కేటాయింపు పూర్తి కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి గడ్డి అన్నారం మార్కెట్ను పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ కంటే ఎక్కువ వసతులు బాటసింగారంలో కల్పించినందున వ్యాపారస్తులంతా స్వచ్ఛందంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
లక్షల గోదాములు
మార్కెట్లో ప్రస్తుతం లక్ష ల సామర్థ్యంగల గోదాములున్నాయి. ఇందులో 50వేలలో అతి పెద్ద గోదాము, మరో 50వేలతో గోదాములు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. అలాగే, రైతుల రెస్ట్ రూం, బ్యాంకు ఏర్పాటుతో పాటు పరిపాలన కోసం భవనం ఏర్పాటు చేశారు. ఎనిమిది ఎకరాల్లో పండ్లను ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుగా స్థలాన్ని సిద్ధంగా ఉంచారు. రైతులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీల కోసం ఫుడ్ కోర్ట్ను కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునిక వసతులతో వే బ్రిడ్జి, పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేశారు.
అత్యాధునిక వసతులతో మార్కెట్
కిషన్రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
బాటసింగారంలో అత్యాధునిక వసతులతో పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేశాం. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలిగిపోనుంది. రాత్రి సమయంలోనే కాకుండా ఎప్పుడైనా ఈ మార్కెట్కు వాహనాలు వచ్చేందుకు వీలు కలుగుతుంది. పండ్ల మార్కెట్ను బాటసింగారంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది.
మార్కెట్లో సకల సౌకర్యాలు
కందాడి ముత్యంరెడ్డి, చైర్మన్
బాటసింగారం పండ్ల మార్కెట్లో సకల సౌకర్యాలు కల్పించాం. రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. గతంలో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు ఉదయం వాహనాలు రావడానికి నిషేధం ఉండేది. కొత్త మార్కెట్లో ఏ ప్రాంతం నుంచి అయినా వచ్చే లారీలు ఎప్పుడైనా వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. వ్యాపారులు, రైతులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలు అక్టోబర్ 1 నుంచి బాటసింగారంలో ప్రారంభించే మార్కెట్లో లావాదేవీలు కొనసాగించాలి.
నూతన మార్కెట్లో సౌకర్యాలు
గోదాముల నిర్మాణం
లావాదేవీలకు బ్యాంకు ఏర్పాటు
క్రయవిక్రయాలకు అతి పెద్ద ధర్మకాంట
అత్యాధునిక సౌకర్యాలతో క్యాంటిన్
పెట్రోల్ బంక్ నిర్మాణం
పోలీసు ఔట్ పోస్ట్
దవాఖాన, ఉచితంగా మందులు అందజేత
తాగునీరు, మూత్రశాలలు
జనరేటర్ ఏర్పాటు