ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 21 : గాలికుంటు వ్యాధి నుంచి మూగజీవాలను కాపాడేందుకు ముందస్తు వైద్యం అందించాలని సర్కారు నిర్ణయించింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నుంచి జీవాలను కాపాడడం కోసం ముందస్తు చర్యలను చేపట్టింది. పశుసంపదను కాపాడుకోవాలని నిర్ణయించి పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. గాలికుంటు వ్యాధి నుంచి కాపాడడం కోసం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి టీకాలు పంపిణీ చేస్తున్నది. ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమవ్వగా జిల్లావ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. ప్రతి ఆరు మాసాలకోసారి పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు వేయించడం ఎంతో అవసరమని పశు వైద్యులు సూచిస్తున్నారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించకపోవడం వలన కలిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆరు నెలల దాటిన దూడల నుంచి అన్ని పశువులకు ఈ టీకాలు వేయించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల వారీగా మూగ జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నారు. పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రైతులపై ఉన్నదని పశుసంవర్ధకశాఖ అధికారులు కోరుతున్నారు.
గాలికుంటు వ్యాధి వలన కలిగే అనర్థాలు
ఈ వ్యాధి సోకిన వెంటనే పశువులకు 104, 105 డిగ్రీల జ్వరం ఉంటుంది.
గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు నోట్లో పుండ్లు కావడంతో మేత మేయడానికి తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది.
అలాగే, పశువుల గెట్కలలో పుండ్లు అవుతాయి.
పాడి పశువులకైతే ఈ వ్యాధి సోకితే పాల ఉత్పత్తులు తగ్గిపోతాయి.
చూడితో ఉన్న పశువులకు ఈ వ్యాధి సోకితే బరువు తగ్గే ప్రమాదముంది.
ఈ వ్యాధి గాలివలన సోకుతుంది.
తప్పనిసరిగా టీకాలు వేయించుకుంటే మంచిదని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 3.69లక్షల ఆవులు, బర్రెలకు టీకాలు వేసే కార్యక్రమం చేపడుతున్నారు. గాలికుంటు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా జిల్లాలోని పశువులకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గ్రామాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. జిల్లాలోని 1.70లక్షల బర్రెలు, 1.99లక్షల ఆవులు, ఎద్దులకు నెల రోజుల పాటు ప్రతి మండలంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నారు. ప్రతి ఆరుమాసాలకోసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీకా వేసిన పశువులకు కొమ్ములకు ఆకుపచ్చరంగు వేయాలని నిర్ణయించారు. దీని వలన టీకా వేసిన పశువులను గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
గాలికుంటు వ్యాధి ప్రమాదకరం
గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైంది. ఈ వ్యాధి సోకకముందే రైతులు జాగ్రత్తపడి టీకా వేయించాలి. టీకా ఇప్పించకపోవడం వలనే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశముంది. టీకా వేయించడం వలన పాల ఉత్పత్తులు తగ్గుతాయని భావించొద్దు. టీకా వేయించకపోతే గాలికుంటు వ్యాధి సోకి పూర్తిగా పాలదిగుబడి తగ్గిపోయే ప్రమాదముంది. తప్పనిసరిగా రైతులంతా మూగజీవాలకు టీకా వేయించాలి.