కోట్పల్లి, అక్టోబర్ 20 : పేదోడికి అందుబాటులో ఉండి, ఉత్తమ పోషక విలువలు కలిగిన ఫలం సీతాఫలం. దీన్ని పేదోడి యాపిల్ అని కూడా పేరొచ్చింది. పల్లెటూరి మధురఫలం సీతాఫలం. ప్రతి వర్షాకాలంలో ఈ ఫలాలు లభిస్తాయి. నిరుపేద కుటుంబాల జీవనాధారం అయితే… పేదోడి నోటికి తియ్యటి ఫలహారం అవుతోంది. ఎన్నో పోషక విలువలు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చెట్టు వర్షపునీరే ప్రాణదారం. ఎలాంటి ఎరువులు అవసరం లేకుండానే మధురమైన ఫలాలను అందించడంలో సాటి లేదు. పోషక విలువలు పుష్కలంగా ఉన్న సీతాఫలాలను ప్రజలందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
పోషక విలువలు పుష్కలం…
పోషకాలు అధికంగా ఉండడంతో సీతాఫలం పండు తియ్యగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ పండును ఇష్టంతో తింటారు. దీంతో మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. మాంసకృతులు, పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు, శరీరానికి శక్తినిచ్చే కొవ్వు పుష్కలంగా ఉంటాయి. ఇందులో లభించే మెగ్నిషీయం శరీర పనితీరును మెరుగుపర్చి గుండెజబ్బుల నుంచి కాపాడుతుంది. సీజన్తో పాటు వచ్చే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ కచ్చితంగా తీసుకోవాలని వైద్యనిపుణులు సూచనలు ఇస్తారు.
పండ్ల అమ్మకాలతో జీవనాధారం..
సీతాఫలం పండ్లు అమ్మడానికి కోట్పల్లి, నాగసమందర్ గేట్, ధారూర్, వికారాబాద్లో అడ్డాలు చేసుకుని అమ్మే పండ్లన్నీ కోట్పల్లి ప్రాజెక్టు అడవిలోంచి తెచ్చినవే. ప్రాజెక్టు పక్కనే ఉన్న ప్రాంతాల వారందరూ ఉదయం పండ్లను తీసుకుని అమ్ముకుని జీవనాధారంగా మలుచుకుంటారు. ఈ పండ్లను ప్రధాన రోడ్ల పక్కన అమ్ముతారు.