రంగారెడ్డి జిల్లా పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే అమెజాన్, వెల్స్పన్, క్రోనస్, టాటా, విజయ్నేహా, పోకర్ణ ఇంజినీర్ స్టోన్ పరిశ్రమ, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్ వంటి పరిశ్రమలను నెలకొల్పగా, తాజాగా మరో రెండు ప్రముఖ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పటికే జిల్లాకు రూ.21,507 కోట్ల పెట్టుబడులు రాగా, చందన్వెల్లి పారిశ్రామికవాడలో రూ.1200 కోట్లతో కిటెక్స్ టెక్స్టైల్స్, రూ.750 కోట్లతో మలబార్ గోల్డ్ పరిశ్రమను నెలకొల్పేందుకు ఆ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ రెండు పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి లభించనున్నది. కిటెక్స్ టెక్స్టైల్స్ సంస్థ చిన్నారుల దుస్తులను తయారు చేయనుండడంతో ఉమ్మడి జిల్లాలోని రైతుల నుంచి నేరుగా పత్తిని కొనుగోలు చేయనున్నది. పత్తికి మద్దతు ధర లభించనుండడంతో అన్నదాతలకుప్రయోజనం చేకూరనున్నది.
రంగారెడ్డి, సెప్టెంబర్ 20, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా పెట్టుబడులకు స్వర్గదామంగా తయారైంది. దేశంలోనే ప్రముఖ పరిశ్రమలైన అమెజాన్, వెల్స్పన్, క్రోనస్, టాటా, విజయ్నేహా, పోకర్ణ ఇంజనీర్ స్టోన్ పరిశ్రమ, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్లాంటి ప్రముఖ పరిశ్రమల ప్లాంట్లను జిల్లాలో నెలకొల్పారు. తాజాగా మరో రెండు ప్రముఖ సంస్థలు జిల్లాలో తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జిల్లాలో ఏర్పాటు కానున్న కొత్త పరిశ్రమలతో జిల్లాలోని వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా పారిశ్రామికరంగంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది, అంతేకాకుండా అనుమతి వస్తుందా, రాదనేది కూడా గ్యారంటీ ఉండేది కాదు కానీ టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోగా అనుమతులు లభిస్తుండడంతో అధిక మొత్తంలో పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. అంతేకాకుండా పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో కూడా పరిశ్రమలను నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలోని చందన్వెల్లి పారిశ్రామికవాడతోపాటు మహేశ్వరంలో రూ.1950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశీయంగా పేరొందిన సంస్థలు ముందుకు వచ్చాయి. చందన్వెల్లి పారిశ్రామికవాడలో కేరళకు చెం దిన టెక్స్టైల్స్ పరిశ్రమ, మహేశ్వరంలో మలబార్ గోల్డ్ సంస్థలు తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కిటెక్స్ పరిశ్రమ జిల్లాలోని చందన్వెల్లి పారిశ్రామికవాడలో రూ.1200 కోట్ల పెట్టుబడులతో తమ పరిశ్రమను నెలకొల్పుతుండగా, రూ.750 కోట్లతో మలబార్ గోల్డ్ సంస్థ తమ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. అయితే కిటెక్స్ టెక్స్టైల్స్ సంస్థ పూర్తిగా చిన్న పిల్లలకు సంబంధించిన దుస్తులను తయారు చేయనుంది. జిల్లాతోపాటు వరంగల్లో కూడా తమ పరిశ్రమను నెలకొల్పేందుకు నిర్ణయించారు. అదేవిధంగా కిటెక్స్ పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాతోపాటు వికారాబాద్ జిల్లాలోని పత్తి పండించే రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. నేరుగా రైతుల నుంచి సంబంధిత సంస్థ పత్తిని కొనుగోలు కూడా చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఇటీవల జరిగిన సమావేశంలో వెల్లడించారు. దీంతో స్థానికంగా ఉన్న రైతులు మధ్యవర్తులతో మోసపోకుండా నేరుగా విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందవచ్చు. కిటెక్స్ పరిశ్రమతో సుమారు 20 వేల మందికి ఉపాధి లభించనుంది. వీరిలో అధికంగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు కిటెక్స్ సంస్థ ముందుకు వచ్చింది. చందన్వెల్లి పారిశ్రామిక వాడలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ కూడా తమ యూనిట్ను ఏర్పాటు చేసేందుకుగాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపింది. త్వరలోనే ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ కూడా చందన్వెల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు కానుంది. అదేవిధంగా చందన్వెల్లి పారిశ్రామిక వాడ విస్తీర్ణం 1800 ఎకరాలకు పెరిగింది. మొదట 600 ఎకరాలతో చందన్ వెల్లి ఇండస్ట్రీయల్ పార్కును అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా షాబాద్ మండలంలోని సీతారాంపూర్లోని 1200 ఎకరాల దేవాదాయ భూములను ఇండస్ట్రీయల్ పార్కుకు ప్రభు త్వం సేకరించింది. అయితే చందన్వెల్లి ఇండస్ట్రీయల్ పార్కుకు భూములిచ్చిన రైతులతోపాటు దేవాదాయ భూములు కావడంతో సంబంధిత శాఖకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల కు ఒక్కొ కుటుంబానికి 120 గజాల చొప్పున స్థలాన్ని కూడా ఇవ్వనున్నారు. కిటెక్స్, మలబార్ సంస్థల పెట్టుబడులతో జిల్లాకు పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా రూ.23,457 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో పెట్టిన పెట్టుబడుల్లో అత్యధికంగా టీఎస్-ఐపాస్ ద్వారానే పెట్టుబడులు వచ్చాయి. టీఎస్-ఐపాస్ విధానం అమల్లోకి వచ్చిన అనంతరం జిల్లాకు రూ. 20,978 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో జిల్లావ్యాప్తంగా గత ఏడేళ్లలో రూ.670 కోట్ల పెట్టుబడులతో 2277 సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. చిన్నతరహా పరిశ్రమలతో రూ.2689 కోట్ల పెట్టుబడులు రాగా, 1168 చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో 105 పెద్ద తరహా పరిశ్రమలు ఏర్పాటుకాగా, రూ.3566 కోట్ల పెట్టుబడు లు, మధ్యతరహా పరిశ్రమలతో రూ.1112 కోట్ల పెట్టుబడులురాగా 63 పరిశ్రమలు నెలకొల్పా రు. మరోవైపు మెగా ఉత్పత్తి పరిశ్రమలు జిల్లావ్యాప్తంగా 11 పరిశ్రమలు ఏర్పాటుకాగా రూ. 3971 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మెగా ఇన్ప్రా(ఐటీ టవర్స్) ప్రాజెక్టులు జిల్లాలో 33 ఏర్పాటుకాగా రూ.9765 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జిల్లాలోని చిన్న, మధ్య, భారీతరహా పరిశ్రమలతో 3,32,705 మందికి ఉపాధి లభించింది.
తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
జిల్లాకు తరలివచ్చే పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటినీ వెంటనే కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో ఇండస్ట్రీయల్ పార్కులకు అవసరమయ్యే భూములను కూడా ప్రజాభిప్రాయంతోనే త్వరగా సేకరిస్తున్నాం. పరిశ్రమల రాకతో స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి లభిస్తుంది.
-డి.అమయ్కుమార్, జిల్లా కలెక్టర్