అధికారిక, అనధికారిక లేఅవుట్లలోని ప్రజావసరాల స్థలాలను ఆక్రమించినవారి భరతం పట్టేందుకు రంగారెడ్డి జిల్లా పంచాయతీ శాఖ రంగం సిద్ధం చేసింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో పార్కులు, ఆలయాలు, ఇతర అవసరాలకు వదిలిన ఖాళీ స్థలాలను భూ బకాసురులు మింగేశారు. కబ్జాదారుల నుంచి స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు జిల్లా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. గ్రామ, మండల, మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి పూర్తి సమాచారాన్ని సేకరించిన అనంతరం సంబంధిత స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులు వాస్తవమని తేలితే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అధికారిక, అనధికారిక లేఅవుట్లలో మొత్తం కలిపి 746 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రంగారెడ్డి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): గ్రామపంచాయతీల్లోని ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామపంచాయతీల్లో వెలసిన లేఅవుట్లలో పార్కులు, ఆలయాలు ఇతర ప్రజా అవసరాల నిమిత్తం వదిలేసిన ఖాళీ స్థలాలు కబ్జాకు గురయ్యాయనే ఫిర్యాదుతో జిల్లా పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామపంచాయతీలవారీగా వెలసిన లేఅవుట్ల పూర్తి వివరాలను జిల్లా పంచాయతీ శాఖ అధికారులు ఇప్పటికే సేకరించారు. జిల్లాలోని ఏ గ్రామపంచాయతీలోనూ ఒక్క ఖాళీ స్థలం కూడా కబ్జాకు గురికాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల చేసిన లేఅవుట్లలో కాకుండా 20-30 ఏండ్ల క్రితం చేసిన లేఅవుట్లలో ఖాళీ స్థలాలన్నీ కబ్జాకు గురయ్యాయని ప్రధాన ఆరోపణ. పార్కులు, ఆలయాలు, కమ్యూనిటీ హాళ్ల కోసం వదిలేసిన ఖాళీ స్థలాల విలువ రూ.కోట్లకు పెరుగడంతో కబ్జాదారులు సంబంధిత స్థలాలపై కన్నేసి కబ్జాకు పాల్పడినట్లు పలు మండలాల ప్రజాప్రతినిధులు ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మరోసారి పాత లేఅవుట్లలోని ఖాళీ స్థలాలకు సంబంధించి వాస్తవాలను తేల్చనున్నారు. మరోవైపు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లోని ఖాళీ స్థలాలన్నింటిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆ దిశగా జిల్లా ఉన్నతాధికారులు ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలను గుర్తించిన జిల్లా యంత్రాంగం, గ్రామపంచాయతీల్లోనూ ఖాళీ స్థలాలను గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తికాగా, మరో వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి, తదనంతరం ఖాళీ స్థలాలన్నింటిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నేటి నుంచి 25 వరకు స్పెషల్ డ్రైవ్
గ్రామపంచాయతీల్లో వెలసిన లే అవుట్లలోని కబ్జా అయిన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. అయితే రోజుకు నాలుగు మండలాల చొప్పున సమావేశాలు నిర్వహించి కబ్జాకు గురైన ఖాళీ స్థలాల వివరాలను సేకరించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సంబంధిత స్థలాలను స్వాధీనం చేసుకోనున్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా మొదట గ్రామ సభలు నిర్వహించాలనుకున్నప్పటికీ, తదనంతరం మండలస్థాయిలోనే సమావేశాలు చేపట్టాలని నిర్ణయించారు. సంబంధిత మండలస్థాయి సమావేశాల్లో జిల్లా పంచాయతీ అధికారితోపాటు జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొంటారు. ఆరు రోజుల్లో గ్రామీణ ప్రాంతంలోని 21 మండలాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. సంబంధిత ప్రత్యేక డ్రైవ్లో కబ్జాకు గురైన పార్కు స్థలాలను వివరాలను సేకరించడంతోపాటు స్వాధీనం చేసుకొని సంబంధిత స్థలాలన్నింటిని పక్కాగా రికార్డుల్లో నమోదు చేస్తారు. గతంలో మున్సిపాలిటీలతోపాటు గ్రామపంచాయతీల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండానే లే అవుట్లు వెలువగా.. ఒక్కో లే అవుట్లో పార్కు స్థలాలతోపాటు ఇతర ప్రజా అవసరాలకై 100 గజాల నుంచి 500 గజాల వరకు వదిలేశారు. తదనంతరం భూముల ధరలకు రెక్కలు రావడంతో సంబంధిత ఖాళీ స్థలాలను కూడా విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖాళీ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవడంతో లేఅవుట్ల నిర్వాహకులే కబ్జాకు పాల్పడినట్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి.
2635 ఎకరాలు జీపీల పేరిట రిజిస్ట్రేషన్
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లోని లేఅవుట్లలో ప్రజావసరాల నిమిత్తం వదిలిన ఖాళీ స్థలాలను గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో వెలసిన లేఅవుట్లలోని 2635 ఎకరాల ఖాళీ స్థలాలను గ్రామపంచాయతీల పేరిట రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేశారు.
జిల్లాలో 16 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 1397 లేఅవుట్లు ఉండగా, వీటిలో అధికారిక లేఅవుట్లు 1017 లేఅవుట్లు, అనధికారిక లేఅవుట్లు 1397 ఉన్నాయి. 1808 ఖాళీస్థలాలుండగా, అధికారిక లేఅవుట్లలో 1039 ఖాళీ స్థలాలు, అనధికారిక లేఅవుట్లలో 769 ఖాళీ స్థలాలున్నాయి. మున్సిపాలిటీల్లోని అధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలాలు 504 ఎకరాలుండగా, అనధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలాలు 242 ఎకరాలున్నట్లు సంబంధిత అధికారులు లెక్కతేల్చారు. త్వరలోనే వీటన్నింటిని ఆయా మున్సిపాలిటీల పేరిట రిజిస్ట్రేషన్ చేయనున్నారు.
మండలాలవారీగా గ్రామపంచాయతీల పేరిట రిజిస్ట్రేషన్
మండలం ఎకరాలు
యాచారం 35.39
శంకర్పల్లి 113.62
శంషాబాద్ 27.73
షాబాద్ 172.74
మొయినాబాద్ 1.83
మంచాల 16.81
మాడ్గుల 12.07
కొత్తూరు 93.63
నందిగామ 122.62
కేశంపేట 66.87
ఇబ్రహీంపట్నం 180.64
చేవెళ్ల 247.51
ఆమనగల్లు 0.72
అబ్దుల్లాపూర్మెట్ 91.05
చౌదరిగూడ 91.77
కొందుర్గు 183.54
తలకొండపల్లి 4.31
ఫరూఖ్నగర్ 309.73
మహేశ్వరం 195.75
కందుకూరు 103.61
కడ్తాల్ 142