ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 18: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ పెట్టడంతో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో పూర్తిగా నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీన్ని లాభాలబాట పట్టించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఈ డిపో పరిధిలో 100 బస్సు లు, 30ఎయిర్ బస్సులు ఉన్నాయి. డీఎం బాబునాయక్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అధికారులు గ్రామగ్రామాన ఆర్టీసీ ప్రయాణంపై కళాజాత, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డిపో పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లోని వివిధ గ్రామాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం నుంచి ప్రత్యేక రూట్లల్లో బస్సులు నడుపుతున్నారు.
రోజుకు రూ.10 లక్షల ఆదాయం
కరోనా రెండో విడుత నుంచి రెండు నెలల క్రితం వరకు రోజూ రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు డిపోకు ఆదాయం వచ్చేది. కాని అధికారుల ప్రత్యేక కార్యాచరణతో పట్నం ఆర్టీసీ డిపో ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తున్నది. ఇరవై రోజుల నుంచి ప్రతిరోజూ రూ.6 నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిపోలోని అన్ని గ్రామాలతోపాటు నగరానికి ప్రత్యేకంగా బస్సులు నడపడంతో ఆదాయం పెరిగినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్టీసీలోనే ప్రయాణించేలా అవగాహన కల్పించి, గ్రామాలకు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం వేళల్లో బస్సులు నడుపుతున్నారు.
విద్యాసంస్థల పునః ప్రారంభంతో పెరిగిన ఆదాయం
పాఠశాలలు, కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించడంతో విద్యార్థులతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆదాయం కూడా పెరిగింది. ఇబ్రహీంపట్నంలో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు పెద్దఎత్తున ఉన్నాయి. ఈ సంస్థల్లో విద్యనభ్యసించేందుకు విద్యార్థులు రావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం చేకూరుతున్నది. ప్రతి కళాశాల, పాఠశాలలకు వెళ్లి అధికారులు ఆర్టీసీ ప్రయాణంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఊరూరా ఆర్టీసీ కళాజాత
గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఆర్టీసీలోనే ప్రయాణించేలా అధికారులు ఊరూరా అవగాహన కార్యక్రమాలు, కళాజాత నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను మరిచి ఆర్టీసీ వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే తక్కువ ఖర్చులో సురక్షితంగా ఇంటికి చేరవచ్చని, ఆర్టీసీలో ప్రయాణించడమే మేలు అనే రీతిలో ప్రజలకు అవగాహన కల్పించడంతో ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తున్నారు.
నష్టాన్ని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళిక
కరోనాతో నష్టాల్లో ఉన్న ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోను లాభాల బాట పట్టించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. ఇదే రీతిలో ప్రజలకు మరింత అవగాహన కల్పించి, ప్రతి గ్రామానికి గంటగంటకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆదాయం బాగానే వస్తున్నది. ప్రజలు ప్రైవేటు వాహనాలను మరిచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసేలా ఆర్టీసీ కృషి చేస్తున్నది.