షాద్నగర్, అక్టోబర్17: నాడు కంప చెట్లు, చెత్త కుప్పలతో అందవికారంగా ఉన్న పల్లెలు నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రామాల ద్వారాలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి ఇంటి ముందు పచ్చని చెట్లు, పూల మొక్కలు తోరణాలుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం ఫలాలు పల్లె ప్రజలు పొందుతున్నారు. ఆరేండ్ల క్రితం ప్రారంభించిన హరితహారం పథకం నేడు ఆదర్శంగా మారి అన్ని వర్గాల ప్రజలను ప్రకృతి ప్రేమికులుగా మార్చింది. ఫలితంగా గ్రామాలు, మారుమూల పల్లెలు, గిరిజన తండాలు పచ్చని చెట్లతో విరాజిల్లుతున్నాయి. ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో హరితహారం పథకం ద్వారా విరివిగా మొక్కలు నాటి పెంచుతున్నారు. దీంతో గ్రామ వీధులు ఆకుపచ్చగా మారి స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. మూడు, నాలుగేండ్లు గ్రామంలో మొక్కలను నాటుతున్నారు. ముఖ్యంగా పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వేలాది మొక్కలను నాటి కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. సుమారు 5 వేల మొక్కలను నాటి ప్రతిరోజూ నీరు అందిస్తున్నారు. అదేవిధంగా మరో 2 వేల మొక్కలను పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్నారు. నిత్యం ఆరు మంది కూలీలు ప్రకృతి వనం సంరక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. జామ, మామిడి, సపోట, కొబ్బరి, సీతాఫలం వంటి పండ్ల చెట్లతో పాటు చల్లటి నీడనే ఇచ్చే మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలస్తున్నారు. ప్రకృతి వనం చుట్ట్టూ ప్రత్యేకంగా కంచెను ఏర్పాటు చేయడంతో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. గ్రామ పరిధిలోని పలు వెంచర్లలో, ప్రధాన దారులకు ఇరువైపులా మొక్కలు నాటి పెంచుతున్నారు. అదేవిధంగా అనువైన ప్రతి చోట గ్రామస్తులు మొక్కలు పెంచడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. చెట్లు స్వచ్ఛమైన గాలిని ఇస్తుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టంతో మొక్కలను పెంచుతున్నాం..
చెట్లు ఉంటేనే వానలు వస్తాయి. దీంతో అందరం మొక్కలను ఎంతో ఇష్టపడి పెంచుతున్నాం. మా ఊరులో ఎక్కడచూసినా పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. హరితహారం పుణ్యమా అని గ్రామంలో స్వచ్ఛమైన వాతావరణం లభిస్తున్నది.
కంటికి రెప్పలా రక్షణ..
మా ఊరిలో హరిత హారం పథకం ద్వారా పెట్టిన మొక్కలన్నీ బతికినవి. నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. అప్పట్లో ఎప్పుడో ఒక్కసారి మొక్కలు నాటేవాళ్లు. కానీ తెలంగాణ సర్కారు వచ్చినంక పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపడుతున్నది.