ధారూరు, అక్టోబర్ 17 : ధారూరు మండలం కోట్పల్లి ప్రాజెక్టులో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. మండలం నుంచే కాకుండా వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు హైదరాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, తదితర ప్రాంతాల నుంచి ప్రాజెక్టును చూసేందుకు కుటుంబసమేతంగా వచ్చారు. ప్రాజెక్టు నీటిలో చిన్నారులను ఆడించి, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం ప్రాజెక్టులో బోటింగ్ చేశారు. ప్రాజెక్టు ఆవరణలో సేద తీరారు. తమ వెంట తెచ్చుకున్న తినుబండారాలను ఆరగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టు వద్ద గడిపి తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.