వ్యాక్సిన్తో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. టీకా పంపిణీని వందశాతం పూర్తిచేయడమే లక్ష్యంగా ఇంటింటికీ వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టింది. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం మొదలుకాగా.. బడంగ్పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ప్రారంభించారు. గ్రామాలు, వార్డులు, కాలనీల్లో పెద్ద ఎత్తున సబ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి 18ఏండ్ల నిండినవారిని సబ్సెంటర్లు, కమ్యూనిటీహాల్స్కు తరలించి వ్యాక్సిన్ ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 268 సబ్సెంటర్లు ఏర్పాటు చేయగా.. గురువారం 29,850 మందికి టీకా వేశారు. వికారాబాద్ జిల్లాలో 251 బృందాలు రంగంలోకి దిగగా.. మొదటిరోజు 4,500 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 20 రోజుల్లో అందరికి మొదటి డోసు వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.
వ్యయప్రయాసలు లేకుండా..
ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మంచిగున్నది. ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా కరోనా టీకా తీసుకున్నా. సబ్సెంటర్ల ఏర్పాటుతో చార్జీలు పెట్టుకొని దవాఖానకు వెళ్లడం.. బారులు దీరడం వంటి ఇబ్బంది తప్పింది. అనుమానాలు లేకుండా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి. ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.
షాబాద్, సెప్టెంబర్ 16 : ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 20 రోజుల వ్యవధిలో జిల్లాలో 100శాతం వ్యాక్సిన్ వేయించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 185, మున్సిపాలిటీల్లో 83తో కలిపి 268 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కేంద్రాల్లో మొత్తం 29,850 మందికి టీకా వేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో, తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాలలో మంత్రి సబితాఇంద్రారెడ్డి వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించగా, మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్గూడ గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, కొత్తూర్, మక్తగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కడ్తాలలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు పాల్గొని వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించారు. షాబాద్ మండలంలోని సర్దార్నగర్లో వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ దామోదర్ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రజలు వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్యసిబ్బందికి సూచనలు చేశారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 20 రోజుల్లో 100శాతం వ్యాక్సిన్ వేయించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఒక్కో పీహెచ్సీ పరిధిలోని నాలుగైదు కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామాల వారీగా ఎంపిక చేసి ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో..
కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్పొరేషన్ల పరిధిలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు కార్పొరేటర్లు ప్రత్యేక చొరవచూపాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పారిజాతానర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీంశేఖర్, తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీవెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, సెప్టెంబర్ 16 : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ గురువారం జిల్లాలో ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా పరిధిలోని 154 సబ్ సెంటర్లు, నాలుగు మున్సిపాలిటీల్లోని 97 వార్డులు, మొత్తం 251 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కేంద్రం వికారాబాద్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగిలోని సబ్సెంటర్లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, తాండూరులో ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్రెడ్డి, వికారాబాద్ మండలం కొత్తగడిలో కలెక్టర్ నిఖిల ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో పని చేసే ఆరోగ్య కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి సుమారు 4,500 మందికి వ్యాక్సిన్ వేశారు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,793 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ లెక్కన గురువారం ఒక్కరోజు 6,293 మందికి వ్యాక్సిన్ వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు వేస్తుండగా, స్పెషల్ డ్రైవ్లో కేవలం మొదటి డోసు వ్యాక్సిన్ వేశారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు సుమారు 2లక్షలకు పైగా మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా రెండు వారాల్లో వంద శాతం మందికి మొదటి డోసు కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకుగాను 251 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కార్యక్రమం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.