ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. ఇదివరకు టౌన్ప్లానింగ్ అధికారులు పరిశీలించి అనుమతులు ఇచ్చేవారు. అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరుగడంతో పాటు కాలయాపన జరిగేది. ఇల్లు నిర్మించుకునేవారు ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతో రాష్ట్ర సర్కార్ టీఎస్-బీపాస్ను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో భవన నిర్మాణదారులే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందవచ్చు. కానీ తీసుకున్న అనుమతికి విరుద్ధంగా, విస్తీర్ణం, భవన అంతస్తుల్లో తేడాలు ఉంటుండడంతో రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందం ప్రత్యేక నజర్ పెట్టింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి పదిహేను రోజులకోసారి తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మూడు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు పొంది, నాలుగు అంతస్తులను నిర్మిస్తుండడంతో నిర్లక్ష్యం వహించిన సంబంధిత మున్సిపల్ కమిషనర్తోపాటు టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా మణికొండ మున్సిపాలిటీ టీపీవోనూ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేపడితే నోటీసు ఇవ్వకుండానే జరిమానా విధించడంతోపాటు నిర్మాణాన్ని కూల్చివేసి, స్వాధీనపర్చుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 15, (నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలపై జిల్లా యం త్రాంగం కొరడా ఝులిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ అక్రమ కట్టడాలపై ప్రత్యేక నజర్ పెట్టింది. జిల్లా అదనపు (స్థానిక సంస్థల) కలె క్టర్ ఆధ్వర్యంలోని జిల్లా టాస్క్ఫోర్స్ బృందం పదిహేను రోజులకోసారి జిల్లాలోని మున్సిపాలిటీల్లో తనిఖీలు చేసి దీనిపై దృష్టి సారిస్తున్నారు. టీఎస్-బీపాస్ అమల్లోకి తీసుకొచ్చిన దృష్ట్యా అక్రమ నిర్మాణాలను వెంటనే గుర్తిస్తున్నారు. అంతేకాకుండా స్థాని కంగా నిర్లక్ష్యం వహించే ఆయా మున్సిపాలిటీ అధికారులపై కూడా వేటు వేస్తున్నారు. గత పది రోజుల్లో తుర్కయంజాల్, మణికొండ మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి జిల్లా టాస్క్ఫోర్స్ బృందం ఆయా మున్సిపాలిటీలకు చెందిన సంబంధిత అధి కారులపై వేటు వేసింది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 253, 254లోని ప్లాట్నెంబర్ 18లో కేవలం మూడు అంత స్తుల భవన నిర్మాణానికి అనుమతులు పొంది, నాలుగు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టడంతో నిర్లక్ష్యం వహించిన కమిషనర్తోపాటు టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పె న్షన్ వేటు వేశారు. అదేవిధంగా మంగళవారం మణికొండ మున్సిపాలిటీ టీపీవోను కూడా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్ 116 లోని నెక్నాంపూర్ గ్రామ పరిధిలోని ప్లాట్నెంబర్ 105 లో ప్రభుత్వ దేవాదాయ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే సెల్లార్తోపాటు రెండు అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు. పుప్పాలగూడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 90,94లోని ప్లాట్నెంబర్ 23పీలో రెండు అంతస్తుల నిర్మాణానికి అను మతిపొంది మూడు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా మరో ప్రాంతాల్లోనూ అనుమతులు పొందిన దానికంటే ఎక్కువ అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు జిల్లా టాస్క్ఫోర్స్ గుర్తించింది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నిర్మాణాదారులకు జరి మానా విధించడంతో పాటు కూల్చివేడం లేదా స్వాధీనం చేసుకోనున్నారు.
టీఎస్-బీపాస్తో దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు మంజూరు అవుతున్నా యి. భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అందుకు కావాల్సిన అన్ని పత్రాలను ఆన్లైన్ లో పొందుపర్చి దరఖాస్తు చేసుకుంటే చాలు క్షణాల్లో స్వీయ ధృవీకరణ(సెల్ఫ్ సర్టిఫి కెట్) పత్రం జారీ అవుతుంది. స్వీయ ధృవీకరణ పత్రం ఆధారంగా భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. గతంలోనూ భవన నిర్మాణ అను మతులు ఆన్లైన్లోనే జారీ అవుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించిన అనంతరమే అనుమతులు జారీ చేసేవారు. టౌన్ ప్లానింగ్ అధికా రులు నిర్ణీత సమయానికి రాకపోవడం, ఒకవేళ వచ్చినా ఎదో ఒక కొర్రీలు పెట్టి లంచం డిమాండ్ చేసే వారు. టీఎస్-బీపాస్ అమల్లోకి వచ్చిన అనంతరం టౌన్ ప్లానింగ్ అధికారుల భాగస్వామ్యం లేకుండా నేరుగా భవన నిర్మాణదారులే టీఎస్-బీపాస్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందుతున్నారు. టీఎస్-బీపాస్ నిబంధనల ప్రకారం 75 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మించే నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి నామమాత్రంగా ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. 75 గజాల నుంచి 600 గజాల వరకు స్వీయ ధృవీకరణ పత్రం ద్వారా అనుమతులిస్తున్నారు. 600 గజాలపైన 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారు, ఒకవేళ నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయలేనట్లయితే డీమ్డ్ అప్రూవల్ జారీ కా నుంది. టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధం లేకుండా జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం క్షేత్రస్థాయిలో ప్రతీ పదిహేను రోజులకోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేసినట్లయితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే సదరు నిర్మాణదారులకు జరిమానా విధించడంతోపాటు భవన నిర్మాణాన్ని కూలగొట్టడం లేదా స్వాధీనపర్చుకోనున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం…
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే జిల్లా టాస్క్ఫోర్స్ బృందం వీటని గుర్తించింది. ప్రతీ పదిహేను రోజు లకోసారి టాస్క్ ఫోర్స్ బృం దం తనిఖీలు నిర్వహిస్తుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించే ఆయా మున్సి పాలిటీల అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుం టాం. ఇప్పటికే తుర్కయంజాల్ మున్సిపాలిటీ, టీపీవోను సస్పెండ్ చేయగా, తాజాగా మణికొండ టీపీవోను సస్పెండ్ చేశాం