వికారాబాద్ కా హవా.. లాకో మరీజోంకా దవా.. అనే సామెత ఉంది.. ఇప్పుడు ఇదే గాలిలో ఎగురుతూ ఔషధాల్ని మోసుకెళుతున్న డ్రోన్లు.. జిల్లా వైపు దేశం మొత్తం చూసేలా చేస్తున్నాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా ‘మెడిసిన్ ఫ్రం స్కై’ పేరుతో పైలట్ ప్రాజెక్టుకు వికారాబాద్ వేదికైంది. శనివారం ఉదయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని ప్రకటించిన మంత్రి కేటీఆర్ ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీ ప్రారంభించామన్నారు. వ్యాక్సిన్లు, రక్తం ఇతర ఔషధాలను ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల్లో ఇతర ప్రాంతాలకు చేరవేయడంతో సత్వర వైద్య సహాయం అందుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పీహెచ్సీకి ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ఔషధాలు పంపిన అనంతరం రాష్ట్రం తీసుకున్న చొరవను కేంద్రమంత్రి అభినందించారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వికారాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఆకాశంలో డ్రోన్ల సందడితో పట్టణమంతా పండుగ వాతావరణం కనిపించింది.
రంగారెడ్డి, సెప్టెంబర్ 11, (నమస్తే తెలంగాణ)/పరిగి : డ్రోన్ల వాడకంతో ప్రజల ప్రాణాలు కాపాడే మహత్తర కార్యక్రమానికి వికారాబాద్ వేదికగా మారిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆకాశమార్గాన ఔషధాలను సరఫరా చేసే మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఇది చారిత్రకమైన రోజని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో డ్రోన్తో మందులు, టీకాలు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన సంఘటనలు ఉన్నాయని, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో డ్రోన్ సాయంతో మందులు, టీకాలు, అత్యవసర సమయంలో పాముకాటు మందులు తరలించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రారంభించిన మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమంలో నిముషాల వ్యవధిలోనే పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు డ్రోన్తో మందులు చేరవేసినట్లు తెలిపారు. డ్రోన్ ద్వారా వికారాబాద్ పట్టణం శాటిలైట్ మ్యాపింగ్ చేయవచ్చని, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో మైనింగ్ ఎక్కువ కాబట్టి, అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతాలనూ గుర్తించి అరికట్టవచ్చని మంత్రి తెలిపారు.
అంతకుముందు హెలిపాడ్ వద్ద కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లకు విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పి.మహేందర్రెడ్డి, సురభి వాణీదేవి, జడ్పీ చైర్ పర్సన్లు పి.సునీతారెడ్డి, అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, కాలె యాదయ్య, పి.నరేందర్రెడ్డి, ఫైలెట్ రోహిత్రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ నిఖిల, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్రోన్లతో వ్యవసాయ రంగంలో మార్పులు..
వికారాబాద్లో డ్రోన్ ప్రాజెక్టు చేపట్టడం సంతోషం
దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ప్రాజెక్టును వికారాబాద్లో చేపట్టడం సంతోషంగా ఉందని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. డ్రోన్ల సాయంతో కొవిడ్-19 వ్యాక్సిన్లను ఆయా ప్రాంతాలకు చేరవేస్తామన్నారు. వైద్యానికి సంబంధించిన అత్యవసర మందులను డ్రోన్లతో చేరవేయడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనున్నదన్నారు. అంబులెన్స్లు ట్రాఫిక్లో ఇరుక్కుపోయినప్పుడు డ్రోన్ సాయంతో మందులు సరఫరా చేయవచ్చన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగానికి మరిన్ని సేవలు..
దేశంలోనే మొదటిసారిగా వికారాబాద్ను డ్రోన్లతో మందులు తరలించేందుకు ఎంచుకున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని వైద్య రంగంలో మరిన్ని సేవలు అందజేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. రెండో వేవ్ సందర్భంగా ఇంటింటి జ్వర సర్వే చేయడం వల్ల కరోనా కట్టడి సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ వైద్య శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలనే ఆలోచనతో సర్కారు పని చేస్తున్నదన్నారు. అవసరమైనచోట దవాఖానల అప్గ్రెడేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. వికారాబాద్లో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసి 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్లో డ్రగ్స్ సెంటర్ సైతం ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ పరీక్షలకు సంబంధించి ఆర్టీపీసీఆర్ సెంటర్ వికారాబాద్లో నెలకొల్పినట్లు మంత్రి పేర్కొన్నారు.
వికారాబాద్ ప్రాంత ప్రజల అదృష్టం..