షాబాద్, అక్టోబర్ 8 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ప్రజలకు అందించి వారి అభివృద్ధికి తోడ్పడాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాలు నుంచి ఎంపీ రంజిత్రెడ్డి అధ్యక్షతన జూమ్ సమావేశం ద్వారా మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, సర్పంచులు, కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ)సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఉన్నందున జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రస్తుతం 78 శాతం అక్షరాస్యతను కలిగి ఉందని, దానిని 97 శాతానికి పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మరుగుదొడ్లు లేని పాఠశాలలను గుర్తించి ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు పోషక విలువలు ఉన్న భోజనాన్ని అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ను వేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నందున వెంటనే మరమ్మతులు చేపట్టాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను కోరారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను త్వరగా అందజేస్తామని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. గ్రామపంచాయతీల్లో 2వేల జనాభా దాటితే కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డిజిల్లా రాష్ట్ర రాజధానికి సమీపాన ఉన్నందున కూరగాయలకు మంచి డిమాండ్, మార్కెట్ ఉందని అందువలన వరికి ప్రత్యామ్నాయంగా రైతులు కూరగాయలు పండించే విధంగా రైతువేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఎంపీ ఆదేశించారు.
పల్లెప్రగతి, పట్టణ ప్రగతుల్లో తెలిపిన విధంగా తుప్పు పట్టిన, వంగిన, విరిగిన కరెంట్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని, వేలాడే వైర్లను సరిచేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించుకోవాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని, రక్తహీనతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారికి ఎంపీ సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ను అందించేలా చర్యలు చేపట్టాలని సివిల్ సప్లయ్ అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి కల్పించేలా జాబ్మేళాలను నిర్వహించాలని ఉపాధి కల్పన అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారిని కోరారు. ఇంకుడు గుంతలు, వర్షాల వల్ల భూగర్భజలాలు బాగా పెరిగాయని, కొత్తగా నిర్మించే భవనాలకు, పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీ సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.