మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ
మారిన పల్లె ముఖచిత్రం
భారీగా పెరిగిన భూగర్భ జలాలు
గత ఏడాదితో పోలిస్తే ఎనిమిది మీటర్ల పైకి వచ్చిన నీళ్లు
పెరిగిన ఆయకట్టుతో రైతుల సంబురం
రంగారెడ్డి, ఏప్రిల్ 18, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన మిషన్ కాకతీయ సత్ఫలితాలిస్తున్నది. మండు వేసవిలోనూ జిల్లాలోని చాలా చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 2339 చెరువులు, 69,197 ఎకరాల ఆయకట్టుండగా దాదాపు 300చెరువుల్లో ప్రస్తుతం 70శాతం నీటి నిల్వలున్నాయి.మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులురెండు,మూడేండ్లుగా చేపట్టడంతో చెరువుల్లో నీటి నిల్వల శాతం క్రమంగా పెరుగడంతో పాటు భూగర్భజలాల నీటిమట్టం కూడా భారీగా పెరిగింది. మిషన్ కాకతీయకు ముందు ఏప్రిల్లో భూగర్భజలాలు 20మీటర్ల లోతులో ఉండేది. కానీ రెండేండ్లుగా జిల్లాలో భూగర్భజలమట్టం పెరుగుతూ వస్తున్నది. అయితే రంగారెడ్డి జిల్లాలో గతేడాది ఏప్రిల్లో 16మీటర్ల లోతులో భూగర్భజలాలుండగా, ఈ ఏడాది ప్రస్తుతం 8.85 మీటర్ల పైకి పెరుగడం గమనార్హం. మరోవైపు చెరువుల పునరుద్ధరణతో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చింది. జిల్లాలోని 2020-21 సంవత్సరానికిగాను 576 చెరువుల్లో 1.32 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలారు.
జిల్లాలో భూగర్భజలాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. జిల్లాలో నీటి నిల్వలను పరిశీలించినట్లయితే రెండేండ్లుగా పైపైకి చేరుతుండడం గమనార్హం. అయితే ప్రస్తుత వేసవిలోనూ జిల్లాలో భూగర్భజలాల నీటిమట్టం సాధారణం కంటే పైనే ఉండడం గమనార్హం. అయితే జిల్లాలోని షాబాద్, షాద్నగర్, శంషాబాద్, శంకర్పల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అయితే ఈ మండలాల్లో భూగర్భజలాలను పెంపొందించేందుకుగాను ఇంటింటికీ ఇంకుడు గుంతలతో పాటు ఉపాధి హామీ ఆధ్వర్యంలో నీటి ఊట గుంతలను తవ్వినట్లయితే భవిష్యత్తులో భూగర్భజలాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు జిల్లా భూగర్భజల శాఖ అధికారులు. అయితే జిల్లాలో ప్రస్తుతం భూగర్భజలాలు కేవలం 8.85 మీటర్ల లోతులోనే ఉండగా గతేడాది ఇదే నెలలో 16.23 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొయినాబాద్ మండలంలో రికార్డు స్థాయిలో భూగర్భజలాలు పెరిగాయి. గతేడాది ఏప్రిల్లో మొయినాబాద్ మండలంలో 27.82 మీటర్ల లోతులో భూగర్భజలాలుండగా ఈ ఏడాది ప్రస్తుతం 23.67 మీటర్ల పైకి చేరి 4.15 మీటర్ల లోతులోనే భూగర్భజలాలున్నాయి. మంచాల మండలంలో గతేడాది 22.90 మీటర్లలో భూగర్భజలాలుండగా ఈ ఏడాది 18.67 మీటర్లు పెరిగి,ప్రస్తుతం కేవలం 4.23 మీటర్లపైకి చేరుకున్నాయి.యాచారం మండలంలోనూ గతేడాది 19.96 మీటర్ల లోతులో ఉండగా ప్రస్తుతం 15.14 మీటర్ల పైకి చేరి కేవలం 4.82 మీటర్లలోనే ఉన్నాయి. అదేవిధంగా ఆయా మండలాల్లో భూగర్భజలాలను పరిశీలించినట్లయితే…అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 4.25 మీటర్లు, ఆమనుగల్లు మండలంలో 5.07 మీటర్లు, బాలాపూర్లో 6.08 మీటర్లు, చేవెళ్లలో 13.98 మీటర్లు, చౌదరిగూడెంలో 8.15 మీటర్లు, కొత్తూరు మండలంలో 5.82 మీటర్లు, కొందుర్గు మండలంలో 6.81 మీటర్లు, కందుకూరులో 5.31 మీటర్లు, షాద్నగర్లో 17.99 మీటర్లు, ఇబ్రహీంపట్నంమండలంలో 5.93 మీటర్లు, కడ్తాల్లో 12.95 మీటర్లు, కేశంపేట్లో 8.57 మీటర్లు, మాడ్గులలో 9.60 మీటర్లు,మహేశ్వరంలో 11.36 మీటర్లు, రాజేంద్రనగర్లో9.63 మీటర్లు, శంకర్పల్లిలో 15.29 మీటర్లు, తలకొండపల్లిలో 13.11 మీటర్లలో లోతులో భూగర్భజలాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
IPL 2021: పంజాబ్కు అదిరే ఆరంభం