రెండు గ్రామాల నుంచి వంద మందికిపైగా పోలీసు
స్పోర్ట్స్ కోటాలో పలువురి ఎంపిక
నిత్యం వాలీబాల్ ఆటతో ఫిజికల్ ఫిట్నెస్
ఆటపై మక్కువతో క్రీడా స్థలం కొనుగోలు
నేటికీ గ్రామంలో పది వాలీబాల్ జట్లు
పరిగి/కులకచర్ల, ఏప్రిల్ 3 :వాలీబాల్ ఆట అంటే ఆ జంట గ్రామాల యువతకు ప్రాణం… ఆ మక్కువనే వారికి ఉద్యోగాలు వచ్చేలా చేసింది. ఇది కులకచర్ల మండలంలోని ఇప్పాయిపల్లి-రాంపూర్ గ్రామాల క్రీడాకారుల ఘనత. నిత్యం వాలీబాల్ ఆడడం అలవాటు చేసుకున్న వీరు శారీరకంగా ఫిట్నెస్ సాధించారు. దీంతో రెండు గ్రామాల్లో కలిపి సుమారు వంద మందికిపైగా యువకులు పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దశాబ్దాలుగా ఇప్పాయిపల్లిలో వాలీబాల్ ఆడడం ప్రారంభించారు. అనంతరం రాంపూర్ గ్రామ యువత వారితో కలిసి ఆడుతూ వస్తున్నారు. ఇక్కడ వాలీబాల్ ఆడినవారు ఎందరో ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాల్లో ఉన్నారు. ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా రెండు గ్రామాలకు చెందిన టీమ్లు పాల్గొంటాయి. పక్కపక్కనే ఉండే ఈ గ్రామాలు ప్రస్తుతం కలిసిపోయాయి. ఇప్పటికీ ఈ రెండు గ్రామాల్లో కలిపి సుమారు 10 వాలీబాల్ జట్లు ఉండడం గమనార్హం. అంతేకాదు అందరూ డబ్బులు వేసుకొని ఏకంగా స్థలాన్ని కొనుగోలు చేసి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకొని ఇతర గ్రామాల యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆ రెండు గ్రామాల్లో పోలీసు నౌకర్లు వచ్చినోళ్లు వంద మందికి పైగానే ఉంటారు. స్పోర్ట్స్ కోటా కింద కొందరు ఉద్యోగాలు దక్కించుకోగా, మరికొందరు ప్రత్యక్షంగానే ఉద్యోగాలు పొందారు. ఈ గ్రామాల్లోని యువతకు నిత్యం వాలీబాల్ ఆడడమంటే ఎంతో మక్కువ. దీంతో శారీరక దారుఢ్యం మెరుగుపడుతున్నది. రెండు గ్రామాల యువత కలిసి ఆడుతూ టీంలను ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా డబ్బులు వేసుకుని గ్రౌండ్ను కూడా కొనుగోలు చేశారు. ఆ గ్రామాలే వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని ఇప్పాయిపల్లి, రాంపూర్. ఈ జంట గ్రామాల్లోని యువత ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా అక్కడకు వెళ్లి ప్రోత్సహిస్తుంటారు. పోలీసు ఉద్యోగాలు పొందిన వాలీబాల్ క్రీడాకారులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
కులకచర్ల మండలంలోని ఇప్పాయిపల్లి, రాంపూర్ గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. 1975 నుంచి ఇప్పాయిపల్లిలో వాలీబాల్ ఆడడం ప్రారంభించి, ఆదర్శంగా నిలిచారు. అనంతరం రాంపూర్ గ్రామానికి చెందిన యువకులు వారితో కలిసి ఆడడంతో ఇప్పుడు ఎక్కడ టోర్నమెంట్ జరిగినా అక్కడకి ఈ టీం వెళ్తున్నది.
వంద మందికి పైగానే పోలీసులు..
ఇప్పాయిపల్లి, రాంపూర్ గ్రామాల యువకులు అత్యధికంగా పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. సుమారు వంద మందికి పైగా ఉద్యోగాలను పొందడంతోపాటు వాలీబాల్ క్రీడలోనూ చురుకుగా పాల్గొంటున్నారు. కొందరికి స్పోర్ట్స్ కోటాలో, మరికొందరికి నేరుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. నిత్యం వాలీబాల్ ఆడడం వల్ల శారీరక దృఢత్వం పెంపొందడం, ఇతర వ్యాయామాలు, పరుగెత్తడం వల్ల కానిస్టేబుల్ నియామకాల్లో రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్ తదితర విభాగాల్లో వాలీబాల్ క్రీడ ఎంతో ఉపయోగపడింది. గ్రామవాసి సర్వర్(వాలీబాల్ క్రీడాకారుడు) 1975లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. తర్వాత 1995 నుంచి రెండు గ్రామాలకు చెందిన యువకులు కానిస్టేబుళ్లుగా ఎంపికవుతున్నారు. వీరందరూ వాలీబాల్ క్రీడాకారులే. ఇప్పటి వరకు ఇప్పాయిపల్లి నుంచి సుమారు 80 మంది, రాంపూర్ నుంచి 25 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నారు. రెండేండ్ల కింద జరిగిన కానిస్టేబుల్ నియామకాల సందర్భంగా ఇప్పాయిపల్లిలో 16 మందికి, రాంపూర్లో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయి. ఇదిలావుండగా ఒక వ్యక్తి ఆర్మీ, మరో వ్యక్తి సీఆర్పీఎఫ్లోనూ ఉద్యోగాలు పొందారు.
క్రీడా స్థలం కొనుగోలు..
2000 సంవత్సరంలో ఎల్లయ్యకు చెందిన సుమారు 22 గుంటల స్థలాన్ని రెండు గ్రామాలకు చెందిన క్రీడాకారులు, క్రీడాభిమానులు 13 మంది కలిసి అప్పట్లో రూ.లక్షా 50వేలకు కొనుగోలు చేశారు. అనంతరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ నిధులతో ప్రహరీ నిర్మించారు. స్థలంలో వ్యాయామం, లాంగ్జంప్, హైజంప్ ప్రాక్టీస్ చేస్తారు. ప్రస్తుతం రెండు గ్రామాల్లో కలిపి సుమారు పది వాలీబాల్ కోర్టులు ఉంటాయి. దీంతో క్రీడాకారుల సంఖ్య పెరిగింది.
ఐఆర్వీఏ పేరిట మ్యాచ్లు…
ఇప్పాయిపల్లి-రాంపూర్ గ్రామాలకు చెందిన క్రీడాకారులు ఇప్పాయిపల్లి, రాంపూర్ వాలీబాల్ అసోసియేషన్(ఐఆర్వీఏ) ఏర్పాటు చేశారు. ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా ఐఆర్వీఏ జట్టు పాల్గొంటుంది. 1995-96 మధ్యలో ఇక్కడే జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను సైతం నిర్వహించారు. ఇతర రాష్ర్టాల్లో సైతం వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొని శభాష్ అనిపించుకున్నారు. ఎక్కడ టోర్నమెంట్ జరిగినా ఓ వ్యానులో 30 నుంచి 40 మంది క్రీడాభిమానులు వెళ్లి ప్రోత్సహిస్తుంటారు.
వాలీబాల్ ఆడడంతో ఉద్యోగాలు…
నిత్యం వాలీబాల్ ఆడడంతో శారీరక దృఢత్వం పెరుగడంతో ఉద్యోగ నియామకాల్లో ఎంతో ఉపయోగపడింది. వాలీబాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. గ్రామంలో కొంతమందిమి కలిసి పోటీలు పెట్టుకునేవాళ్లం. వాలీబాల్ క్రీడ వల్ల కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.
గ్రామస్తుల ప్రోత్సాహం గొప్పది…
వాలీబాల్ ఆటకు గ్రామస్తుల ప్రోత్సాహం చాలా గొప్పది. టోర్నమెంట్ నిర్వహణకు రెండు గ్రామాల పెద్దలు సహకరిస్తున్నారు. వేరేచోట టోర్నమెంట్ అయితే డీసీఎంలో వచ్చి ప్రోత్సహిస్తారు. పోలీసు కానిస్టేబుల్గా ఎంపికైన ఏఎస్సై రాంజీ ఆదర్శంగానే వాలీబాల్ ఆటపై మక్కువ పెంచుకున్నాం.