భక్తులకు కొంగుబంగారం.. కప్పాడు వేంకటేశ్వర స్వామి
ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ, పంచాయతీ పాలకవర్గం
భారీగా తరలిరానున్న భక్తులు
ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 3: భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలుగొందుతున్నాడు కప్పాడు వేంకటేశ్వరస్వామి. ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పాడు గ్రామంలో వేంకటేశ్వరస్వామి స్వయంభుగా వెలిసినట్లు భక్తులు భావిస్తున్నారు. రెండెకరాల విస్తీర్ణంతో ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఏకశిలపై స్వామివారు, అలివేలు మంగ, పద్మావతి దేవతామూర్తులు కొలువుదీరారు. స్వామివారికి ఎదురుగా గరుడ వాహనుడు కొలువై ఉన్నాడు. ఆలయం పక్కనే కోనేరు ఉంది. గ్రామంలోని వేంకటేశ్వరస్వామికి చిల్కూరులో ఉన్న బాలాజీకి దగ్గరి పోలికలు ఉంటాయని భక్తుల నమ్మకం. చిల్కూరులో బాలాజీ స్వామి ఏకశిలా విగ్రహం మాదిరిగానే కప్పాడులో వేంకటేశ్వరస్వామి ఉన్నాడని చరిత్ర తెలిసిన పెద్దలు పేర్కొంటారు. కప్పాడులో వేంకటేశ్వరస్వామి ఆలయం నేటికీ చెక్కు చెదరలేదు. ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. భక్తులు శని, ఆదివారాలతోపాటు పండుగలు, సెలవు రోజుల్లో ఇక్కడికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి కల్యాణ మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమై ఈనెల 7వ తేదీ వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమల వివరాలు
బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 4న ఉదయం కోవిళ్యారు తిరుమంజనం, స్వస్తివచనం, ఋత్వర్ణరం, రక్షాబంధనం, అంకురార్పణ, హోమం. 5న ఉదయం అభివాహన హోమం, ధ్వజారోహణం, హోమం, దేవతాహ్వానం, భేరీపూజ, బలిహారం, 6న హోమం, బలిహారం, ఎదురుకోళ్లు, ఉదయం 11గంటలకు శ్రవణ నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశమున పద్మావతి, అలివేలుమంగ సహిత వేంకటేశ్వరస్వామి కల్యాణం, మధ్యా హ్నం అన్నదానం, 7న తెల్లవారుజామున రథోత్స వం, హోమం, బలిహారం, మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం పవళింపుసేవ, తీర్థప్రసాదాలతో కార్యక్రమం ముగుస్తుంది.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
నేటినుంచి నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్ నిబంధనల మేరకు తాగునీటి సౌకర్యం కల్పించాం. వేంకటేశ్వరస్వామి కల్యాణానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– మల్లారెడ్డి, ఆలయకమిటీ చైర్మన్, కప్పాడు