నిన్నటి దాకా కూలీ పనిచేసిన ఎంతో మందిని త్వరలోనే ఓనర్లుగా మార్చే మహోజ్వల ఘట్టానికి గురువారమే అంకురార్పణ జరుగబోతున్నది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దిగ్విజయంగా అమలవుతున్న ఈ పథకం.. నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభంకాబోతున్నది. తొలివిడుత ఎంపిక చేసిన 119 మంది లబ్ధిదారుల్లో ఎక్కువగా పరిశ్రమల స్థాపనకే మొగ్గుచూపగా, వారి ఆసక్తికి తగ్గట్టుగా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. గురువారం అమాత్యుడు ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వబోతుండగా, దళితజాతి సంబురపడుతున్నది.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికి రాష్ట్ర సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేస్తున్నది. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి 10లక్షలు అందిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలలో లబ్ధిదారుల ఎంపిక చురుగ్గా సాగుతున్నది. దళిత బంధు కార్యక్రమాలపై పలుసార్లు జిల్లా యంత్రాంగం ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించింది.
లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టింది. ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షలు ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మంచి ఆదాయం కోసం ఎలాంటి యూనిట్లు ఎంచుకోవాలి? పది మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలతోపాటు చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలాల్లో సదస్సులు నిర్వహించారు.
దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశాం. మెజార్టీ లబ్ధిదారులంతా పరిశ్రమలు పెట్టుకునేందుకు ముందుకొచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో 10 మందికి జీవనోపాధి కల్పించేలా దళితబంధు లబ్ధిదారులు ఆలోచన చేయడం సంతోషకరమైన విషయం. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తాం. జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతాం.
– అజ్మీరా వినోద్కుమార్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ (రాజన్న సిరిసిల్ల జిల్లా)