జోగుళాంబ గద్వాల
యాసంగి పంట పెట్టుబడి కష్టాలు తీరాయి. రైతుకు అండగా నిలిచేందుకు సర్కార్ ప్రారంభించిన రైతుబంధు గత నెల 28న ప్రారంభం కాగా గురువారంతో ముగిసింది. అన్నదాత బ్యాంక్ ఖాతాల్లో రూ.1216,31,67,324 జమైంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 9,50,215 మందికి లబ్ధి చేకూరింది. పెట్టుబడి సాయం అందడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేశారు. రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
మహబూబ్నగర్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధు అండతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో సంబురంగా నిమగ్నమయ్యారు. పంట పెట్టుబడి కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి లేకుండా దర్జాగా రైతుబంధు సాయంతో వ్యవసాయం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఏడాదికి రెండు సార్లు రైతుబంధు రూపంలో అందించే సాయం ఈ యాసంగిలో అందరి ఖాతాల్లో జమైంది. గత నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రైతుబంధు పంపిణీ గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,50,215 రైతుల ఖాతాల్లో రూ.1216.32 కోట్లు జమయ్యాయి. కాగా.. ఉమ్మడి జిల్లాలో గత వానకాలంలో 9,23,393 మంది రైతుల ఖాతాల్లో రూ.1217.52 కోట్లు జమయ్యాయి. అంటే కేవలం ఒక్క ఏడాదిలో ఉమ్మడి జిల్లాలోని అన్నదాతలకు పంట సాయంగా సర్కారు రూ.2433.84 కోట్లను అందచేసింది. గతంలో పంట పెట్టుబడిగా కనీసం నయాపైసా ఇవ్వని సర్కార్లను చూసిన అన్నదాతలు.. నేడు ఏడాదికి ఎకరానికి రూ.10వేలు ఉచితంగా పంట సాయం అందించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు డబ్బులను కండ్లతో చూస్తూ అన్నదాతలు పడిన సంతోషం వర్ణనాతీతం. సీఎం కేసీఆర్ తమకు నిజమైన రైతుబంధువంటూ మురిసిపోతున్నారు. దేశంలో తొలిసారిగా రైతులకు నగదు సాయం పథకం ప్రారంభించిన కేసీఆర్.. ఆ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా.. ఎక్కడా వెనక్కు తగ్గకుండా రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు.