చేర్యాల, జనవరి 17 : కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే అగ్నిగుండం, పెద్దపట్నం కార్యక్రమాలను ఆలయ వర్గాలు రద్దు చేశాయి. సోమవారం హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో గంగరేగు చెట్టు ప్రాంగణంలో భక్తులు చిన్నపాటి పెద్దపట్నం భక్తిశ్రద్ధలతో వేశారు. సంప్రదాయం పడిపోకుండా ఉండేందుకు యాదవ భక్తులు పట్నం వేసి దానిని దాటి శ్రీ మల్లికార్జునస్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను దర్శించుకున్నారు. అంతకుముందు భక్తులు పసుపును ఒకరిపై ఒకరు చల్లుకున్నారు.
పట్నం వారం ఆదాయం రూ.36,01,182
కొమురవెల్లి మల్లికార్జునస్వామి పట్నం వారం సందర్భంగా రూ.36,01,182 ఆదాయం వచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం రూ.14,21,172, ఆదివారం రూ.21,80,010 ఆదాయం వచ్చింది. ఆర్జీత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా మొత్తం రూ.36,01,182 స్వామివారి ఖజానాకు సమకూరింది. ఈవో ఎ.బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, ధర్మకర్తలు ఉట్కూరి అమర్గౌడ్, కొంగరి గిరిధర్, చింతల పరశురాములు, దినేశ్ తివారీ, పొతుగంటి కొంరెల్లి, తాళ్లపల్లి శ్రీనివాస్, సాయియాదవ్, సూపరింటెండెంట్ నీల శేఖర్,సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు. చేర్యాల సీఐ శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో సీఐ,ఎస్సైలతో పాటు 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.