మామిళ్లగూడెం, జనవరి 19: జిల్లాలో జలవనరులు, నీటిపారుదల ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు, నీటిపారుదల శాఖ స్థలాల పరిరక్షణ చర్యలపై కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని లకారం, ఖానాపురం ఊర చెరువులతోపాటు వెలుగుమట్ల, ధంసలాపురం చెరువుల పరిధిలో ఆక్రమణలను గుర్తించి సత్వరం హద్దులను ఏర్పాటు చేయాలని, ఆయా ప్రాంతాల్లోని జలవనరుల్లో జరిగిన ఆక్రమణలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లకారం, ఖానాపురం ఊర చెరువు విస్తీర్ణం, ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. కేఎంసీలో ఉన్న చెరువుల ఆక్రమణలను వెంటనే తొలగించి వాటిని పూర్వ స్థితికి తెచ్చి అభివృద్ధి పర్చాలన్నారు. అన్ని లే ఔట్లను తనిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ నిర్ధారణ చేసి సరిహద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో జరిగే నిర్మాణాలకు అనుమతులను జారీ చేసే ముందు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ మధుసూదన్, జడ్పీ సీఈవో అప్పారావు, ఇరిగేషన్ సీఈ శంకర్నాయక్, ఎస్ఈ రవికుమార్, ల్యాండ్ సర్వే ఏడీ రాము, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దార్లు నర్సింహారావు, శైలజ తదితరులు పాల్గొన్నారు.