మిరుదొడ్డి, జనవరి 16 : సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మిరుదొడ్డి మండలం వీరారెరెడ్డిపల్లి-జంగపల్లి గ్రామాల శివారులోని బండ మల్లన్న గుట్టపై శనివారం మల్లికార్జునస్వామి జాతర వైభవంగా సాగింది. మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట, దుబ్బాక, మెదక్ జిల్లా చెగుంట మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలు ఉదయం నుంచే ఆలయ పరిసరా ప్రాంతాల్లో నూతన వస్ర్తాలు ధరించి పిల్లా పాపలతో మల్లికార్జుస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయం త్రం వీరారెడ్డిపల్లి, జంగపల్లి, అల్మాజీపూర్, దౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు బోనాల బండ్లు, కాడెడ్లను అందంగా అలంకరించి గ్రామాల్లో డప్పుచప్పుల్లు, పోతరాజుల విన్యాసాల మధ్య ఘనంగా ఊరేగించారు. జాతరలో ఒగ్గు కళాకారులు ఆలపించిన పాటలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. గుట్టపై ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించింది. జాతరకు వచ్చిన భక్తులుకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్ పన్యాల వెంకట్రెడ్డి, ఎంపీటీసీ బాలమల్లేశంగౌడ్, ఆలయ కమిటీ వారు మౌలిక వసతులు కల్పించారు.