ఉస్మానియా యూనివర్సిటీ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కిష్టయ్య చిత్రపటంపై పూలు చల్లి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2009లో చేపట్టిన పోలీసు నియామకాలలో భాగంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్న 14ఎఫ్ను రద్దు చేయడంతో కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తు చేశారు. 14ఎఫ్ రద్దుకు నిరసనగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు శాంతియుతంగా చేస్తున్న నిరసనలపై సమైక్య పాలకుల దారుణ అణిచివేతను గమనించిన కిష్టయ్య ఎంతగానో కలత చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడిన కేసీఆర్ను అన్యాయంగా అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడంతో కిష్టయ్య ఇక లాభం లేదనుకుని తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని అమరుడయ్యాడని చెప్పారు.
ఆయన త్యాగం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యిందని పేర్కొన్నారు. కిష్టయ్య త్యాగాన్ని స్మరించుకుంటూ అన్ని రంగాల్లో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ బంగారు తెలంగాణకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.