ఉస్మానియా యూనివర్సిటీ : పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచకుండా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లినపుడే వారిలో చైతన్యం కలుగుతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ప్రస్తుత సమాజంలో కవులు, రచయితల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. వారు కాలాన్ని మార్చగులుగుతారని అభిప్రాయపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని సంస్కృత అకాడమీలో ‘సనాతన ధర్మం-సమాజశ్రేయస్సు’పై మూడు రోజుల సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జూలూరి గౌరీశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలాలుమారినా, లోకాలు మారినా సమాజాన్ని సరైన మార్గంలో నడిపేశక్తి కవులకు ఉందన్నారు.
చారిత్రాత్మక మార్పుకు సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. తుపాకీ పట్టిన నక్సలైట్ ఎంత త్యాగశీలో కవి కూడా అంతే త్యాగశీలి అని కొనియాడారు. చినజీయర్ స్వామి ఉపదేశాలతో ప్రజలు ఆధ్యాత్మికం వైపు మరలుతున్నా రని పేర్కొన్నారు. ప్రపంచాన్ని మార్చేందుకు కావ్యం దారి చూపుతుందని చెప్పారు.
మనిషి సాటి మనిషిని ప్రేమించే సమాజం రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని, భూమిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలను కాపాడుకోగలుగుతామని వివరించారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాలని, దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
మార్కులు, ఉద్యోగాల కోసం సంస్కృతాన్ని అభ్యసించకూడదని కోరారు. జీవితం కోసం, సమాజంలో మార్పు కోసం సంస్కృతాన్ని అభ్యసించాలని సూచించారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ, ఓయూకు ఉండే ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని చెప్పారు. సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం మాట్లాడుతూ సదస్సు లక్ష్యాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ డైరెక్టర్ మహామహోపాధ్యాయ సముద్రాల వెంకట రంగరామాను జచార్యులు, ప్రొఫెసర్ శశిరేఖ, ఓయూ సంస్కృత విభాగం హెడ్ ప్రొఫెసర్ విద్యానంద ఆర్య, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృతం విభాగం హెడ్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ ప్రసాద్, సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ జోషి సంతోష్కుమార్, డాక్టర్ వరలక్ష్మి, సూర్యప్రకాశ్, ఎంఎస్ఎస్వీ శర్మ, మంజీర, శ్రీనివాస్, భరద్వాజ్, రాము తదితరులు పాల్గొన్నారు.