సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 11: మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి ఇటీవలే పాఠశాల డైరెక్టరేట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో తరగతితో పాటు ఏడు నుంచి పది తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా, ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఆరో తరగతి కి, ఈ నెల 20 నుంచి 30 వరకు ఆపై తరగతుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా, జూన్ 5న 7 నుంచి 10 తరగతులకు, 6న ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
మోడల్ స్కూళ్లలో కార్పొరేట్కు దీటుగా బోధిస్తుండడం, యేటా ఉత్తమ ఫలితాలు వస్తుండడంతో ప్రవేశాలకు పోటీ పెరుగుతోంది. పదో తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు 10 జీపీఏ సాధిస్తూ ఐఐఐటీలో సీట్లు సాధించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. అత్యున్నత ప్రమాణాలతో ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తూ ప్రతి విద్యార్థిపై పర్యవేక్షణతోపాటు వారిని ప్రోత్సహిస్తూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఉత్తమ ఫలితాలు రాబడుతున్నారు.
ఒక్కో విద్యార్థికి రూ.లక్ష వ్యయం
ఆదర్శ పాఠశాలలను 2013-14 విద్యా సంవత్సరంలో ప్రారంభించగా, మొదట కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులతో నిర్వహించాయి. 2015-16 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత రాష్ర్టాలకే వదిలేసింది. దీంతో స్వరాష్ట్రంలో మోడల్ స్కూల్స్ను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఏడాదికి ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.లక్ష వెచ్చిస్తున్నది. 2017 నుంచి ప్రతి పాఠశాలలో 100 మంది బాలికలకు (ఇంటర్) హాస్టల్ వసతి కల్పిస్తున్నది. కేజీబీవీ, ట్రైబల్, మైనార్టీ, గురుకుల, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లోని మెనూనే ఇక్కడ అమలు చేస్తున్నారు. రెండు పూటలా నాణ్యమైన భోజనం, ఉదయం వేళలో టిఫిన్, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు. ప్రతి నెలలో ఆరు సార్లు నాన్వెజ్తో భోజనం అందిస్తున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతి నుంచి పదో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడులైంది. దరఖాస్తు చేసుకొనేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో వంద సీట్లు ఖాళీ ఉండనుండగా, ఆపై తరగతుల్లో ఖాళీలను బట్టి భర్తీ చేస్తారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 15 నుంచి 30 వరకు, 7 నుంచి 10 వతరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. కాగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.75, ఇతరులకు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. జూన్ 1 నుంచి 6 లోపు వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. జూన్ 5న 7 నుంచి 10 వ తరగతి కోసం, జూన్ 6న ఆరో తరగతి కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన వారి ధ్రువీకరణ పత్రాలను 18 నుంచి 20 వరకు పరిశీలిస్తారు. జూన్ 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కాగా, పూర్తి వివరాలకు http telanganams. cgg.gov.inలో సంపద్రించవచ్చు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడు పాఠశాలలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడు మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీర్నపల్లి , కోనరావుపేట, బోయినపల్లి మండలకేంద్రాలతో పాటు తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట, గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, ముస్తాబాద్ మండలం నామాపూర్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది
అలాగైతే నో అలర్ట్నేటివ్.. లాక్డౌన్పై కేజ్రీ