అవిశ్రాంత సేవకుడు మల్లేశం..
విద్యానగర్, ఏప్రిల్ 4: సర్వీసులో ఉండగా తన సేవలతో చెరగని ముద్ర వేసుకున్న బంక మల్లేశం ఇప్పటికీ ప్రజల కోసమే పరితపిస్తున్నారు. నాడు పిల్లల వైద్యుడు, జనరల్ సర్జన్గా పేదల పెన్నిధిగా మారిన ఆయన, మూడేళ్ల కిందే రిటైర్డ్ అయినా అవిశ్రాంతంగా సేవ చేస్తున్నారు. ఓ వైపు చిన్నపాటి క్లీనిక్ నడుపుతూనే ఐదేళ్లుగా వ్యాయామ చికిత్సతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. తన వద్దకు వచ్చే పేషెంట్లతోపాటు శాతవాహన కాలేజీ మైదానంలో నిత్యం వందలాది మందితో వ్యాయామం చేయిస్తున్నారు. ఏండ్లపాటు వేధించిన ఎంతటి దీర్ఘకాలిక వ్యాధినైనా తన చిట్కాలతో తగ్గిస్తూ జీవితాలను నిలబెడుతున్నారు.
ఆరోగ్యం అనేది ఆహారం, వ్యాయామాల సమ్మేళనం. మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం కానీ శారీరక వ్యాయామాన్ని మాత్రం విస్మరిస్తున్నాం. ఫలితంగా అనేక రోగాల బారిన పడుతున్నాం. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో 30 ఏండ్లు దాటాయంటే చాలు బీపీ, షుగర్ సహా భుజం, మెడ, వెన్ను, కాళ్ల నొప్పులు, థైరాయిడ్ లాంటి అనేక వ్యాధులు వెంటాడుతున్నాయి. ఏండ్ల తరబడి దవాఖానల్లో చూపించుకున్నా, ఎన్ని మందులు వాడినా సైడ్ ఎఫెక్ట్స్ రావడం తప్ప రోగం నయంకాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి కరీంనగర్కు చెందిన రిటైర్డ్ పిల్లల వైద్యుడు, జనరల్ సర్జన్ బంక మల్లేశం వ్యాయామ చికిత్స ద్వారా ఇట్టే నయం చేస్తున్నారు.
100 నుంచి 80 కిలోలకు తగ్గా
ఇంతకుముందు నా బరువు 100 కేజీలు. బాత్రూంకు వెళితే తాడు కట్టుకుని పైకి లేచేవాడిని. నడవడం ఇబ్బందిగా ఉండి ఆయాసం వచ్చేది. అలాంటిది సార్ వద్ద మెళకువలు నేర్చుకొని వ్యాయామం మొదలుపెట్టా. మూడు నెలలకే 20 కిలోల బరువు తగ్గా. ఉల్లాసంగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను నడకనే కాకుండా రన్నింగ్ చేస్తున్నా. నా జీవితంలో నేను మళ్లీ కనీసం నడుస్తాననే బాధ ఉండేది. అలాంటిది ఇప్పుడు నేను పరుగెత్తుతున్నా.
దాసరి దశరథం
ప్రైవేట్ దవాఖానవెళ్లినా నయం కాలే
నాకు డిస్క్ సమస్య. హైదరాబాద్లో ఎన్నో దవాఖానాలకు వెళ్లిన. ఎక్కడా తగ్గలేదు. కార్పొరేట్ దవాఖానలోనూ చికిత్స తీసుకున్నా. అయినా ఉప శమనం కలుగలేదు. ఇక జీవితాంతం డిస్క్ సమస్యతో బాధపడాల్సిందేనా అని చాలా బాధపడ్డా. అలాంటి సమయంలో డాక్టర్ మల్లేశం సారే స్వయంగా ఇంటికి వచ్చి మా వ్యాయామం చేయండి పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. దీంతో రోజూ ఉదయాన్నే యూనివర్సిటీ మైదానానికి వచ్చి చేస్తున్నా. 15 రోజుల్లోగా పూర్తిస్థాయిలో డిస్క్ సమస్య పోయింది. ప్రతిరోజు వ్యాయామం చేస్తుంటే రోజంతా ఉల్లాసంగా ఉండగలుగుతున్నా.
సింగిరెడ్డి మంజుల, గృహిణి
ఎవరీ మల్లేశం..
బంక మల్లేశానిది పెద్దపల్లి మండలం మూలసాల. కరీంనగర్లో పిల్లల వైద్యుడు, జనరల్ సర్జన్గా పనిచేశారు. మూడేళ్ల క్రితమే రిటైర్డ్ అయ్యారు. ఒకరోజు తన ఎడమ చేతికి వచ్చిన సమస్యతో బాధపడ్డ ఆయన, వ్యాయామం ద్వారా నయం చేసుకున్నారు. అప్పటి నుంచి వ్యాయామ విద్యలో మెళకువలు నేర్చుకొని ఉచితంగా ప్రజలకు అందిస్తూ వ్యాధులను దూరం చేస్తున్నారు. 2015లో ఎస్సారార్ కళాశాలలో ఉచిత వ్యాయామ విద్య అందించిన ఆయన, ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ మైదానంలో రోజూ ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు దాదాపు 100 మందికి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా 25 రకాల వ్యాయామాలు చేయిస్తుండడంతో కాళ్లు, చేతులు, మోకాళ్లు, వెన్నెముక నొప్పులు తగ్గిపోతున్నాయి. అధిక బరువున్న వారు తగ్గుతున్నారు. శ్వాస ఇబ్బందులు సైతం మాయమైపోతుండగా, మల్లేశం శిక్షణకు ఆదరణ పెరిగిపోతున్నది.
వ్యాయామంతోనే ఆరోగ్యం
ప్రతిరోజూ అరగంట వ్యాయామం, నడకతో ఆరోగ్యంగా ఉండవచ్చు. నాకు 2015లో ఎడమ భుజం నొప్పి వచ్చింది. పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకుంటే తాత్కాలికంగా ఉపశమనం కలిగినా మళ్లీ వచ్చేది. దీంతో నేను సొంతంగా వ్యాయామం చేయడం ప్రారంభించా. వారం రోజులు నొప్పులు అనిపించినా మెళ్లగా పూర్తి ఉపశమనం కలిగింది. ఈ క్రమంలో నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో దీర్ఘకాలిక వ్యాధులు, కనీసం కూర్చొని లేవలేని పరిస్థితుల్లో ఉన్నవారిని వ్యాయామం చేయాలని ప్రోత్సహిస్తున్నా. కొందరితో ప్రత్యేకంగా చేయించగా, 15 రోజుల్లోనే సాధారణ స్థితికి చేరడంతో మరింత మందితో చేయించాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నా.
డాక్టర్ బంక మల్లేశం, రిటైర్డ్ వైద్యుడు
ఇవి కూడా చూడండి..