రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకనాడు చుక్కనీటికి తండ్లాడింది. తాగు, సాగు నీటికి గోస పడింది. ఈ ప్రాంతం గోస తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజల తలరాతను మార్చేందుకు సంకల్పించారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూ రంలో ఉన్న గోదావరిని ఈ ప్రాంతానికి మళ్లించారు. ఇప్పుడు వర్షాల రాకతో సంబంధం లేకుండా ఇక్కడి ప్రజలకు తాగు, సాగునీటి రందీని తీర్చారు.
ఎండలు మండుతున్న వేళ.. పంటలకు జీవం పోసేందుకు గోదావరి జలాలు మెట్ట ప్రాంతానికి తరలివస్తున్నాయి.. మల్లన్నసాగర్ తొగుట పంప్హౌస్ నుంచి విడుదలై.. కూడవెల్లి వాగు ద్వారా పరవళ్లు తొక్కుతున్నాయి.. మధ్యలో చెరువులు, చెక్డ్యాంలను నిండుకుండలా మారుస్తున్నాయి.. నేడో రేపో నర్మాలలోని ఎగువమానేరును ముద్దాడనుండగా మెట్టప్రాంతానికి చెందిన రైతు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ యేడు బంగారు పంట పండుతుందని సంబురాల్లో మునిగితేలుతున్నాయి. ఇచ్చిన మాట మేరకు రెండేళ్లుగా అప్పర్ మానేర్కు జలకళ తెస్తున్న మంత్రి రామన్నకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
2020 జూన్లో గంభీరావుపేటకు వచ్చిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఏడాది లోగా మెట్ట ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంకల్పసిద్ధితో ముందుకెళ్లి అనుకున్నది సాధించారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీతో సంబంధం లేకుండా 12 ప్యాకేజీ ద్వారా మల్లన్న సాగర్ నుంచి ఎగువ మానేరుకు గోదావరి జలాలను తీసుకురావాలని సంకల్పించారు. అందుకు అనుగు ణంగా మల్లన్నసాగర్ వద్ద కెనాల్కు ప్రత్యేకమైన శాశ్వత డిస్ట్రిబ్యూటరీని ఏర్పాటు చేశారు. దీంతో మల్లన్నసాగర్ తొగుట పంప్హౌస్ నుంచి కూడవెల్లి వాగుకు గోదావరి నీళ్లు మళ్లించడం సులువుగా మారింది. మల్లన్నసాగర్ నుంచి గతేడాది ఏప్రిల్లో గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సారి మార్చి 19న మంత్రి హరీశ్రావు తోగుట పంప్హౌస్ నుంచి గోదావరి జలాలు విడుదల చేయగా, కూడవెల్లి వాగు గుండా పరవళ్లు తొక్కాయి. వాగుపై మొత్తం 39 చెక్ డ్యాంలు నిండుకుని నర్మాల ఎగువ మానేరుకు గోదారి జలాలు చేరుతాయి. ప్రస్తుతం 38 చెక్ డ్యాంలు పూర్తి స్థాయిలో నిండా యి. చివరిది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం చెక్ డ్యాంకు జలాలు చేరాయి. నేడో, రేపో ఎగువమానేరు తాకనున్నాయి. ఇది నిండితే 13 వేల ఎకరాలకు సకాలంలో నీరందనుండగా, ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో నీటిగోస తీరిందని సంబురపడుతున్నారు.