ఖలీల్వాడి/ మాక్లూర్, మే 5: రాష్ట ప్రభుత్వం రైతులు పంటలు వేసి నష్టపోకుండా ఉండేందుకు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా వానకాలం పంటల సాగుపై అవగాహన కల్పించనున్నది. పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయడానికి వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తే రైతు లాభపడుతాడో తెలిపేందుకు వ్యవసాయశాఖ శుక్రవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశం మాక్లూర్ మం డలం గుత్ప శివారులోని అపురూప వేంకటేశ్వర ఆలయ ఆవరణలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ఆగ్రోస్ ఎండీ రాములు హాజరుకానున్నారు. గతంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే రాష్ట్రంలో ఇతర పంటలను వేసుకొని కొంత మంది రైతులు లాభపడ్డారు. ఎక్కువగా ఉల్లి, సన్ఫ్లవర్, వేరుశనగ, పల్లి, కందులు తదితర పంటలు వేసుకున్నారు.
రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించారు. గతేడాది కొంతమంది రాజకీయ లబ్ధికోసం రైతులను తప్పుదోవ పట్టించడంతో కొంతమంది రైతులు వరి పండించి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తుగా ఏయే పంటలు వేయాలో రైతుల అభిప్రాయాలు తీసుకొని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా సాగును కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పంటల్లో పెట్టుబడులను తగ్గించుకునేలా మార్కెట్ అవసరాలు తీర్చుకునేలా అవగాహన కల్పించనున్నారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందుగా అధికారులు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు. సమావేశంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా రైతుబంధు సమితి ప్రతినిధులకు ముం దుగా అవగాహన కల్పిస్తారు. వారు గ్రామా లు, మండలాల వారీగా అన్నదాతలను చైతన్యం చేయాల్సి ఉంటుంది. సాగు మార్కెటింగ్లకు అనుగుణంగా ఏ పంట వేయాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిపాలనా యంత్రాంగంతో పాటు వ్యవసాయ ఉద్యానశాఖలో ఏఈవో నుంచి జేడీ వరకు అన్ని స్థాయిల అధికారులు, జడ్పీ, ఐడీసీఎంఎస్ చైర్మన్, సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
అవగాహన సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తదితరులతో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మ్రంతులు నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
వేల్పూర్,మే 5: రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు కామారెడ్డిలో కళాభారతి ఆడిటోరియం ప్రారంభోత్సవం, 11 గంటలకు మాక్లూర్ మండలం గుత్ప వద్ద నిర్వహించనున్న వానకాలం సాగుపై అవగాహన సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మార్క్ఫెడ్ కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 3.30 గంటలకు డిచ్పల్లి రాంపూర్ వద్ద ఏర్పాటుచేసిన విశ్వ ఆగ్రోటెక్ బయో ఫర్టిలైజర్ యూనిట్ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5గంటలకు గన్నారం నుంచి సిర్నాపల్లి వరకు రూ.10.05 కోట్లతో చేపట్టనున్న ఆర్ అండ్బీ డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు.