రైతులు పొలంలో దుక్కులు దున్నడం వలన పంట దిగుబడుల్లో అనుకున్న ఫలితాలుంటాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.పంట కోసిన తర్వాత కర్ర తీయడం, దాన్ని కాల్చేయడం చేస్తుంటారు. అలా చేస్తే భూమిలో ఉండే వానపాములు, మరికొన్ని మేలుచేసే క్రిములు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతులు ఎంచుకోవాలి. అందులో ఒకటి వేసవి దుక్కులు. వేసవి దుక్కులతో పంటకు మేలు కలుగుతుంది.
-గాంధారి, మే 12
ఎండాకాలం వచ్చిందంటే చాలు నల్లరేగడి భూములు, ఎర్రనెలలు ఉన్న చాలా మంది రైతులు పంట భూముల్లో ట్రాక్టర్లతో (ప్లౌవ్) లోతు దుక్కులను దున్నించడానికి ఆసక్తి చూపుతున్నారు. నల్లరేగడి భూములు అధికంగా ఉన్న గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్, లింగంపేట్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్ తదితర మండలాల్లో చాలా మంది రైతులు ఎండాకాలం రాగానే ఖర్చుకు సైతం వెనుకాడకుండా భూములను లోతుగా దున్నిస్తారు.
భూములను లోతుగా దున్నడంతో భూముల్లో ఉన్న గడ్డి జాతి మొక్కలకు సంబంధించిన విత్తనాలు లోతుకుపోయి మొలకెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా భూమి పొరల్లో పంటలకు నష్టం కలింగించే చాలా రకాల కీటకాలకు సంబంధించిన లార్వాలు, శిలీంధ్రాలు, ఫిపాలు క్షీణిస్థ్థాయి. లోతుగా దున్నడంతో భూములు గుల్లబారి వదులుగా మారడంతో ఎక్కవ దిగుబడులు వస్తాయి. పంట భూములను లోతుగా దున్నించడంతో రైతులకు పలు రకాలుగా ప్రయోజనాలు ఉండడంతో ఎక్కువ మంది ఎండాకాలంలో లోతు దుక్కులు చేయిస్తున్నారు.
నల్లరేగడి, ఎర్రనేలలు ఉన్న భూముల్లో ఎక్కువగా తుంగ గడ్డి, గునుగు, గరుక, వయ్యారిభామ, ఉత్తరేణి అలం, పాల అలం వంటి చాలా రకాల కలుపు జాతి మొక్కల ఉధృతి ఉంటుంది. రైతులు పంట భూముల్లో కలుపు మొక్కలను నివారించుకోవడానికి ముందస్తు చర్యల్లో భాగంగానే ఎండాకాలంలో లోతు దుక్కులు దున్నిస్తారు. భూములను లోతుగా దున్నడంతో భూమి పైపొరలో ఉన్న కలుపుజాతి మొక్కల విత్తనాలు భూమిలోపలికి పోతాయి. దీంతో వర్షం కురిసినప్పుడు గడ్డిజాతి విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం ఉండదు. దీంతో పంట భూముల్లో కలుపు మొక్కలు మొలకెత్తవు.
ఎండాకాలంలో పంట భూములను లోతుగా దున్నుకోవడంతో భూమి పొరల్లో దాగి ఉండి పంటకు నష్టం కలిగించే కీటకాలకు సంబంధించిన శిలీంద్రాలు, లార్వాలు, ఫీపాలు భూమి పొరల్లో నుంచి పైకివచ్చి సూర్యరశ్మి తగలడంతో ఎండవేడిమికి చనిపోతాయి. అందుకే చాలా మంది రైతులు వానాకాలానికి రెండు, మూడు నెలల ముందు నుంచే పంట భూములను లోతుగా ప్లౌవ్ చేయిస్తారు. దీంతో వానకాలంలో రైతులు సాగుచేసే పంటకు నష్టం కలిగించే కీటకాల ఉధృతి తగ్గుతుంది.
భూములను లోతుగా దున్నడంతో భూమి పొరల్లో సూర్యకిరణాలు ప్రసరించడంతోపాటు దుక్కిలో ఉన్న ఖాళీ ప్రదేశాలకు గాలి, వెలుతురు వెళ్తుంది. దీంతో వర్షం కురవగానే భూమి బిగుసుకుపోకుండా గుల్లబారి ఉంటుంది. వర్షం కురిసిన వెంటనే పంటలను వేసుకోవడానికి అనుకూలంగా మారుతాయి. అంతేకాకుండా వేసిన విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. అదేవిధంగా పంట మొక్కలకు సంబంధించిన వేర్లు భూమిలోకి త్వరగా చొచ్చుకుపోయి పంటలు ఏపుగా పెరిగి దిగుబడి అధికంగా వస్తుంది.
ఎండాకాలంలో భూమిని దున్నించడంతో గడ్డి మొక్కలు చచ్చిపోయి, వాటి గింజలు లోతుగా పోవడంతో గడ్డి ఎక్కువగా మొలవదు. దీంతో కలుపు ఖర్చులు తగ్గుతాయి. పంటలు వేసుకునే సమయంలో భూమి వదులుగా ఉంటుంది.దీంతో పంట ఏపుగా పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుంది.
-తాడ్వాయి సాయిలు, రైతు, గాంధారి
భూములను లోతుగా దున్నుకోవడంతో భూమిపొరల్లో దాగిఉన్న, పంటకు నష్టం కలిగించే కీటకాలకు సంబంధించిన శిలీంధ్రాలు, లార్వాలు, ఫీపాలు ఎండవేడిమికి చనిపోతాయి. దీంతో కీటకాల ఉధృతి తగ్గుతుంది. పంటకు సంబంధించిన వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది.
-నరేశ్, మండల వ్యవసాయ అధికారి, గాంధారి