బాయిల్డ్ రైస్ కొనలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన తెలంగాణ రైతులకు శాపంగా మారనుంది. వరి ఎక్కువగా పండించే నిజామాబాద్ జిల్లా కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాయిల్డ్ రైస్మిల్లులకూ ఈ నిర్ణయం శరాఘాతమే. రైతుల ఓట్లతో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ ఈ విషయంలో నోరుమెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫక్తు రాజకీయ ప్రకటనలే తప్ప, రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర సర్కారు నిర్ణయంపై అర్వింద్ ఎందుకు స్పందించడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాయిల్డ్ రైస్ను కొనలేమంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో వానకాలంలో సాగవుతున్న వరి పంట దిగుబడుల పరిస్థితిపై గందరగోళం ఏర్పడింది. రైతు వ్యతిరేక విధానాలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ సర్కారు విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనలేమంటూ తేల్చేయడం తెలంగాణ రైతులకు శాపంగా మారనున్నది. అందులో వరి ఎక్కువగా పండించే నిజామాబాద్ జిల్లా కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవనున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయంపై ఇప్పటికే తెలంగాణ సర్కారు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండిగా వాదిస్తూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. నిజామాబాద్ జిల్లా రైతుల ఓట్లతో గెలిచిన ఎంపీ ధర్మపురి అర్వింద్(బీజేపీ) ఈ విషయంపై కనీసం నోరు ఎత్తడం లేదు. ఫక్తు రాజకీయ ప్రకటనలు తప్పా రైతు ప్రయోజనాలు దెబ్బ తీస్తున్న కేంద్ర సర్కారు నిర్ణయంపై అర్వింద్ స్పందించడం లేదు. కనీసం రైతుల పక్షాన కేంద్రంతో మాట్లాడేందుకు ముందుకు రాకపోవడం దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పండించిన వరిని కేంద్రం వద్దంటే ఎంపీ ఏం చేస్తున్నాడంటూ ఇందూరు అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. వరి సిరులు కనిపించడం లేదా? అంటూ నిలదీస్తున్నారు. బీజేపీ ఎంపీగా ఉండి కూడా అర్వింద్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడంటూ కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు.
బాయిల్డ్ రైస్ పేరిట కిరికిరి..
వానకాలం, యాసంగి సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు రకం బియ్యం జోరుగా సాగవుతుంది. సీఎం కేసీఆర్ జల విధానాలతో ఏడేండ్ల కాలంలో బీడు భూములు సాగులోకి వచ్చాయి. పుష్కలంగా నీటి వనరులు పెరగడంతో వరి సాగు భారీగా విస్తరించింది. గతంలో వచ్చిన ఉత్పత్తి కంటే రెండేండ్లుగా ధాన్యం దిగుబడులు రెట్టింపు స్థాయిలో వస్తున్నాయి. కేంద్ర సర్కారు ప్రకటించిన కనీస మద్ధతు ధరను తెలంగాణ ప్రభుత్వమే రైతులకు చెల్లించి ధాన్యాన్ని సేకరిస్తున్నది. సేకరించిన ధాన్యాన్ని మర ఆడించిన అనంతరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)కి అందిస్తున్నది. ధాన్యం సేకరణలో యూపీఏ హయాంలో జరిగిన విధానానికి భిన్నంగా ఎన్డీయే సర్కారు వ్యవహరిస్తున్నది. చీటికీ మాటికి రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా నిబంధనలను తీసుకు వస్తున్నది. మోదీ సర్కారు తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్రం సేకరిస్తున్న బియ్యాన్ని ఎఫ్సీఐ స్వీకరించకుండా మోకాలడ్డు పెడుతుండడంతో రైతుల పరిస్థితి దీనంగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి సేకరించిన బియ్యాన్ని కేంద్రం తీసుకునే పరిస్థితి లేదంటూ చేతులు ఎత్తేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతున్నది. తాజాగా బాయిల్డ్ రైస్ను తీసుకోమంటూ కేంద్రం ప్రకటించడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాలతో ఉత్తరాది రాష్ర్టాల్లో నిరసనోద్యమం తీవ్రంగా ఎగిసి పడుతున్నది. బియ్యం సేకరణ పేరిట తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తెలంగాణ రైతుల పొట్ట కొట్టనున్నాయి.
పెరిగిన సాగు విస్తీర్ణం..
కర్షకుల మేలు కోసం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. గతంలో వానకాలంలోనూ పంటలు సాగు చేయాలంటే ఒకటికి పది సార్లు రైతులు ఆలోచించేది. కాలం కలిసి రాకపోతే తమ బతుకులెట్లా? అని ఆందోళన చెందేది. 2014 నుంచి రైతుకు గడ్డు కాలం పూర్తిగా పోయింది. సాగు సంబురంలా మారుతున్నది. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులతో నేడు పంటల సాగుకు రైతులు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. దీంతో ధాన్యం దిగుబడులు నిజామాబాద్ జిల్లాలో గణనీయంగా పెరుగుతున్నాయి. 2014-15 సంవత్సరంలో వానకాలం సీజన్లో 2,42,278 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇదే ఏడాది యాసంగిలో 14,889 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడులు కనిపించాయి. 2020-21 వానకాలంలో 5,82,534 మెట్రిక్ టన్నుల మేర ధాన్యం దిగుబడులను ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధరను 92వేల 479 మంది రైతులకు తెలంగాణ సర్కారు కల్పించింది. ఇదే ఏడాది యాసంగిలో 98వేల 262 మంది రైతుల నుంచి 7,43,531 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లాలో సేకరించారు. ఏడేండ్లలో ధాన్యం ఉత్పత్తులు భారీగా దిగుబడులు సాధించడం అంటే సాధారణ విషయమేమి కాదు. కర్షకుల కన్నీళ్లు తుడుస్తూ, సాగుకు అనుకూల వాతావరణం కల్పించడంతోనే ఇదంతా సాధ్యమైంది.
ఎంపీ తీరుపై అన్నదాతల ఆగ్రహం..
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంపీగా అర్వింద్ గెలిచి రెండేండ్లు దాటింది. వంద రూపాయల బాండ్ పేపర్పై సంతకం చేసి 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. గెలిచిన తర్వాత ఐదు రోజుల్లోనే తెస్తానన్న బోర్డు ఊసే లేకుండా పోయింది. దీంతో పసుపు రైతులంతా ధర్మపురి అర్వింద్ తీరును అడుగడుగునా ఎండగడుతున్నారు. రైతుల ఆగ్రహావేశాలతో ఎంపీ అర్వింద్ తన నియోజకవర్గంలో పర్యటనలు సైతం చేయలేకపోతున్నాడు. క్షేత్ర స్థాయిలో కనీసం రైతులకు ముఖం చూపెట్టకుండా తిరుగుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ దశలో వరి అత్యధికంగా సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో కేంద్రం తీసుకు వచ్చిన తాజా మార్గదర్శకాలు ఆశానిపాతంగా మారింది. బాయిల్డ్ రైస్ను కొనేది లేదంటూ కేంద్రం తేల్చిచెప్పడంతో ఎంపీ అర్వింద్ కనీసం రైతుల గురించి ఇసుమంతైనా ఆలోచించడం లేదు. పసుపు బోర్డు హామీని తుంగలో తొక్కిన బీజేపీ ఏకంగా వరి సాగు చేస్తున్న రైతులపై పిడుగుపాటుకు గురి చేసే విధంగా నిబంధనలను రుద్దడంపై బాధ్యత గల బీజేపీ ఎంపీ మౌనం దాల్చడంపై రైతులు ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల క్రితమే కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఎంపీ అర్వింద్.. తెలంగాణ రైతుల మేలు కోసం ఎందుకు చర్చించలేదంటూ మండిపడుతున్నారు. ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహంతో ఉండడంతో ధర్మపురి అర్వింద్ తనదైన శైలిలో తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపణలు వ్యక్తం అవుతు న్నాయి. టాపిక్ను డైవర్ట్ చేయడానికి అనవసరమైన టాపిక్లను తెర మీదికి తీసుకు వచ్చి టైం పాస్ చేస్తున్నాడంటూ కన్నెర్ర చేస్తున్నారు.
రైతులకు తీవ్ర నష్టం..
ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వం దొడ్డు వరి ధాన్యం కొనమని చెప్పడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
సాగు పెరిగింది..
ఆర్మూర్: సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలతో రాష్ట్రం లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రైతులకు అన్యాయానికి గురిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోకుంటే రైతుల కోపానికి గురికాక తప్పదు.