భద్రాచలం/ పర్ణశాల, జనవరి 16: ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆఖరి తంతుగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా ఏటా రథోత్సవం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం యాగశాలలో రథాంగ హోమం జరిపారు. ఆలయ ఈవో బానోత్ శివాజి దంపతులు కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని తాతగుడి సెంటర్ వరకు రథంలో రామయ్య తండ్రి ఊరేగుతుంటే రహదారుల కిరువైపులా భక్తులు బారులు తీరారు. తాతగుడి సెంటర్ నుంచి ఆలయానికి తోడ్కోని వచ్చిన అర్చకులు రథం నుంచి రామయ్యను ప్రత్యేక పల్లకీలో ఉంచి గాలిగోపురం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆండాళ్ అమ్మవారిని మరో పల్లకీలో ఉంచి గంటసేపు శ్రీకృష్ణ రాయబారం నిర్వహించారు. అనంతరం ప్రణయ కలహోత్సవం గురించి ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి భక్తులకు వివరించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా శనివారం సాయంత్రం వైభవంగా రథోత్సవం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రామయ్యకు రాపత్తు సేవ
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి దేవస్థానంలో శనివారం రాపత్తు సేవను వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణాలయంలో నిర్వహించాల్సిన రాపత్తు ఉత్సవాన్ని ఒమిక్రాన్ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో జరిపారు. స్వామివారిని కళింగ మర్దిని అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని మేళతాళాల నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకొని వచ్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన జరిపారు. దేవస్థానం ఈవో బానోత్ శివాజీ, ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్, ఉప ప్రధానార్చకులు మురళీ కృష్ణమాచార్యులు, విశ్రాంత ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు పాల్గొన్నారు.