భువనగిరి అర్బన్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో దూసుకు పోతున్నది మండలంలోని నందనం. పల్లెప్రగతిలో భాగంగా గ్రామపంచాయతీలో రూ.1.14 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ నిర్మాణాలతో ప్రజల సమస్యలు తీరాయి. పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపడుతుండడం, హరితహారంలో విరివిగా మొక్కలు నాటడం వల్ల పల్లె పచ్చగా.. పరిశుభ్రంగా మారింది.
అభివృద్ధికి అధిక నిధులు
భువనగిరి-వలిగొండ ప్రధాన రహదారిపై ఉన్న నందనం గ్రామంలో 300 ఇండ్లు ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 1300 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో అంతర్గత రోడ్లు సరిగా లేక వర్షం వస్తే బురదతో కనీసం నడిచే పరిస్థితి లేకుండా పోయేది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో అన్ని వీధుల్లో సీసీరోడ్లు నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి ద్వారా మొదటి విడుతలో రూ.48 లక్షలు, రెండో విడుతలో రూ.25లక్షలు విడుదలయ్యాయి. దానికి తోడు గ్రామ పంచాయతీ నిధులు రూ.10లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. రూ.2.50లక్షలతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. రూ.11లక్షలతో ట్రాక్టర్, ట్రాలీని కొనుగోలు చేసి గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ఫలితంగా గ్రామం పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. ఎమ్మెల్సీ నిధులు రూ.5లక్షలతో బీసీ కమ్యూనిటీహాల్ నిర్మించారు. తాగునీటి ఎద్దడి నివారణకు రూ.5 లక్షలతో బోరు, మోటారు ఏర్పాటు చేశారు.
రూ.12.60 లక్షలతో వైకుంఠధామం
మృతి చెందిన వారి అంత్యక్రియలు చేసేందుకు సరైన స్థలం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం అందించిన రూ.12.60లక్షల నిధులతో గ్రామ శివారులో వైకుంఠధామం నిర్మించారు. అందులో పురుషులు, స్త్రీలకు వేర్వేరు స్నానపు గదులు నిర్మించారు. ప్రధాన రహదారి నుంచి వైకుంఠధామం వరకు రోడ్డును ఏర్పాటు చేసి దానికి ఇరువైపులా మొక్కలను నాటారు. గ్రామంలో ఇప్పటి వరకు రూ.1.14 కోట్లకు పైగా అభివృద్ధి జరిగింది.
పచ్చని పల్లె
గ్రామంలో విరివిగా మొక్కలు నాటడంతో అవి పెరిగి నీడనిస్తున్నాయి. రూ.5లక్షలతో పల్లెప్రకృతి వనం, నర్సరీని ఏర్పాటు చేశారు. ఇందులో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అవి పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. హరితహారంలో భాగంగా నందనం నుంచి సింగిరెడ్డిగూడెం వరకు 1500 మొక్కలు, నందనం నుంచి నమాత్పల్లి వరకు 500 మొక్కలు, నాగిరెడ్డిపల్లి వరకు 1000 మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలోని ఖాళీస్థలాల్లో నాటిన మొక్కలతో పాటు ప్రతి ఇంటికీ ఐదు మొక్కలను అందించి వాటి సంరక్షణ పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
గ్రామపంచాయతీలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కృషి చేస్తు న్నాం. తాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీరోడ్లతో పాటు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. నందనం నుంచి సిరివేణికుంట, బొల్లేపల్లి వరకు రోడ్డు పనులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సహకారంతో ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే రవాణాసౌకర్యం మెరుగు పడుతుంది.
-కడమంచి ప్రభాకర్, సర్పంచ్ నందనం
రెండేళ్లలోనే అభివృద్ధి
రెండేళ్లలోనే గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. పల్లెప్రగతితో గ్రామంలో స్పష్టమైన మార్చు జరిగింది. గతంలో వార్డులు చెత్తతో కనిపించేవి. ఇప్పుడు రోజూ చెత్త సేకరిస్తుండడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. వైకుంఠధామం నిర్మించడంతో చివరి మజిలీ కష్టాలు తొలిగాయి.
నాగేళ్లి రమేశ్. ఉప సర్పంచ్, నందనం.