నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం సిద్ధమైంది. సిద్ధార్ధుడిగా మొదలైన అడుగుల నుంచి బుద్ధుడిగా నిర్యాణం చెందే వరకూ కీలక ఘట్టాలను కండ్లకు కడుతూ.. అష్టాంగ మార్గాలను బోధించేలా రూపుదిద్దుకున్న ఈ అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం ఈ నెల 14న అందుబాటులోకి రానున్నది. శనివారం నాగార్జునసాగర్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్.. మంత్రులు శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డితో కలిసి బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా సీఎం కేసీఆర్ సంకల్పంతో 247 ఎకరాల్లో అత్యద్భుతంగా రూపుదిద్దుకుని, తెలంగాణకే మణిహారంగా నిలుస్తున్న బుద్ధవనం విశేషాల సమాహారం మధ్యపేజీల్లో..అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లోని హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనం తెలంగాణకు మణిహారంలా నిలువనున్నది. 274 ఎకరాల్లో గౌతమ బుద్ధుడి జీవిత విశేషాలతో అద్భుతంగా నిర్మించిన పార్కులు, శిల్పాలు, స్థూపాలు దేశ, విదేశీ పర్యాటకులు, బౌద్ధ భిక్షువులను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ గుర్తింపు పొందనున్న చారిత్రక బుద్ధవనం ప్రాజెక్టు విశేషాలను తెలుసుకుందాం.
– నందికొండ, మే 12
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని హిల్కాలనీలో 2003 సంవత్సరంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.42 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించాయి. అయితే.. 2014 వరకు నిధుల కొరతతో పనులు అంతంత మాత్రంగానే నడిచాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా 2015లో రూ.25కోట్లు మంజూరు చేశారు. దీంతో పనులు శరవేగంగా జరిగి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 14న మంత్రి కేటీఆర్ ప్రారంభించి బౌద్ధ భిక్షువులకు, పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నారు. మరో 35 కోట్ల రూపాయలతో అదనపు పనులు చేపట్టనున్నారు. బుద్ధవనం దర్శనానికి వచ్చే బౌద్ధ భిక్షువులు, పర్యాటకుల కోసం హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బస్సులను టూరిజం శాఖ ఏర్పాటు చేయనున్నది.
భారత దేశంలోని సాంచీ, సారనాథ, అజంతా, అమరావతి, కారలే, మాణిక్యాల 5 రకాల స్థూపాల నమూనాలు, వివిధ దేశాల్లోని మీర్పూర్ఖాన్ (పాకిస్తాన్), అనుదాధపూర్ (శ్రీలంక), పగోడ (చైనా), చోర్టన్ (టిబెట్), బౌద్ధనాథ్ (నేపాల్) తదితర 8 బౌద్ధ స్థూపాల నమూనాలతో మొత్తం 13 స్థూపాలను ఈ పార్కులో పొందుపరిచారు. ప్రపంచంలో ఉన్న బౌద్ధులు ఒకే చోట స్థూప నమూనాలు చూసే విధంగా ఈ పార్కును నిర్మించారు.
గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన అహింసాయుతమైన అష్టాంగ మార్గాలను బుద్ధవనంలో పొందుపరుచుతూ బౌద్ధ భిక్షువులను, పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు చేపట్టారు. 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించగా, అందులో 35 ఎకరాలను విపాస ధ్యాన కేంద్రానికి కేటాయించారు. బుద్ధుడు అనుసరించిన అష్టాంగ మార్గాలను బోధించే బుద్ధ చరిత్ర వనం, జాతక పార్కు, ధ్యాన వనం, స్థూప పార్కు, మహాస్థూపం పనులు పూర్తయ్యాయి.
నాగార్జున రిసెర్చ్ సెంటర్, కృష్ణావ్యాలీ పార్కు, బుద్ధిజం తెలంగాణ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా ముఖ ద్వారాన్ని అశోక చక్రం, ఏనుగులతో అద్భుతంగా నిర్మించారు. ప్రపంచంలోని అన్ని బౌద్ధమత స్తూపాల నమూనాలను ఒకే చోట చూపడం బుద్ధవనం ప్రత్యేకత. బుద్ధవనంలోని బౌద్ధ శిల్పాలు, స్థూపాలు, మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఏర్పాటు చేశారు.
బుద్ధవనం ప్రారంభం కాగానే పర్యాటకులకు, బౌద్ధ భిక్షువులకు అందుబాటులో తేనున్నారు. ఇప్పటి వరకు ఉచిత దర్శనం కల్పించగా.. ఇక నుంచి వంద రూపాయల లోపు టికెట్ను ఏర్పాటు చేస్తామని బుద్ధవనం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బుద్ధవనానికి వచ్చే బౌద్ధ భిక్షువులు, పర్యాటకుల కోసం హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. బద్ధవనం సందర్శించే వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్లు, పిల్లల కోసం స్నాక్ బార్, మినీ ట్రైన్ను ఏర్పాటు చేశామన్నారు. పర్యాటకులకు వివరించేలా గైడ్లను అందుబాటులో ఉంచారు. నాగార్జునసాగర్కు వచ్చే పర్యాటకులకు బుద్ధవనం, నాగార్జునకొండ, చాకలిగట్టు, నెల్లికల్ అర్బన్ పార్కులు ఒకే ప్యాకేజీలో చూపించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
బుద్ధుడికి సంబంధించి ప్రపంచంలో ఉన్న వేర్వేరు సంప్రదాయాలను ఆవిష్కరించేందుకు బుద్ధవనంలో ధ్యాన వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కులో 27 అడుగుల అవకాన బుద్ధుడి అవతార విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిష్ఠించిన శిల్పాలకు అవసరమైన ఆకుపచ్చ వర్ణ సమ్మితమైన సున్నపురాయి కోసం పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలోని బృందం కృష్ణపట్టి ప్రాంతాల్లోని క్వారీలను పరిశోధించి వాడపల్లి, సత్తెనపల్లి సమీపంలోని కాట్రపాడు, మద్దిపాడు క్వారీల నుంచి రాయిని ఎంపిక చేశారు. ఈ రాయిని అవసరమైన సైజుల్లో తొలిచి విగ్రహాలను తయారు చేశారు.
బుద్ధవనంలో నిర్మించిన మహాస్థూపం దక్షిణ భారత దేశంలో అతిపెద్దది. దీనిని 42 మీటర్ల వ్యాసంతో, 21 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. రెండు వేల సంవత్సరాల క్రితం శాతవాహన కాలంలో అమరావతిలో నిర్మించిన మహాస్థూపానికి సంబంధించిన కొలతలతో దీని నిర్మాణం చేశారు. అందుకు 128 మంది కళాకారులు పని చేశారు. మహాస్థూప నిర్మాణంలో అష్టాంగ మార్గానికి గుర్తుగా 8 భాగాలను ఏర్పాటు చేశారు. ఇందులో మ్యూజియం, ఆడిటోరియం, లైబ్రరీలు ఉన్నాయి. ఆసియాలోనే అతి పెద్ద కాంక్రీట్ స్థూపం కాగా.. భారత దేశంలో మూడోది.
బుద్ధుడికి సంబంధించి 547 జాతక కథలు ప్రపంచంలో వాడుకలో ఉన్నాయి. ఇందులో ప్రముఖమైన 42 కథలను సేకరించి, వాటిని వివరించే విధంగా శిల్పాల రూపంలో ఈ పార్కులో పొందుపరిచారు.
గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన ఐదు ఘట్టాలు ఇందులో ఉన్నాయి. బుద్ధుడి జననం, మహా నిష్క్రమణ, తపస్సు చేయడం, ఉపన్యాసం, మరణం వంటి ఘట్టాలను కంచు లోహాలతో పొందుపరిచారు. బుద్ధుడు అహింసా మార్గాన్ని ఎంచుకున్న ఘట్టాలు, అడవులకు పోయిన సన్నివేశాలు, బోధి వృక్షం కింద జ్ఞానం పొందిన అంశాలకు సంబంధించిన శిల్పాలను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. బుద్ధ చరిత వనంలో బుద్ధుడి పాదాల నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
సిద్ధార్థుడికి బాహ్య ప్రపంచంలో చూసి చలించిన ముసలి వ్యక్తి, రోగి, అంతిమ యాత్రగా వెళ్తున్న మృతదేహం, సాధువు శిల్పాలను ఇక్కడ ఏర్పాటుచేశారు. పుట్టిన ప్రతి జీవికీ ముసలితనం రావడం, ఆరోగ్యం క్షీణించడం, మరణం తప్పదని తన రధసారథి చెన్నుడు ద్వారా సిద్ధార్థుడు తెలుసుకుంటాడు. చివరగా మానవ సంబంధాలను త్యజించిన సాధువును చూసి జీవితంలో సత్యం, నిజమైన జ్ఞానం తెలుసుకోవాలని భావించి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటాడు.
వృక్షం కింద మహిళ, ఆమె ముందు బాలుడు ఉన్న శిల్పం సిద్ధార్థుడి జననం గురించి తెలుపుతుంది. సిద్ధార్థుడు మాయాదేవికి లుంబినీ వనంలో సాల వృక్షం కింద జన్మించాడని చెప్పడమే దీని ప్రత్యేకత. పైకి వేలు చూపుతున్న బాలుడే చిన్నప్పుడు సిద్ధార్థుడు అని, ఆకాశం వైపు వేలు చూపించడానికి అర్థమేమిటంటే.. సిద్ధార్థుడు పుట్టుకతోనే ఏడు అడుగులు వేస్తాడని, ప్రతి అడుగుకు ఒక పద్మం వికసిస్తుందని నానుడి.
శ్రీలంక, తెలుగు ప్రజల మధ్య రెండు వేల సంవత్సరాల అనుబంధానికి ప్రతీకగా అప్పటి శ్రీలంక మంత్రి లలిత్ ముడాలి నాగార్జునకొండలో సింహళ విహారం నిర్మాణం చేపట్టారు. ఈ అనుబంధాన్ని కొనసాగించడానికి బుద్ధవనంలో 27 అడుగుల ఎత్తైన బుద్ధ విగ్రహం, దమ్మగంటను శ్రీలంక తరఫున ఇక్కడ ఏర్పాటు చేశారు.
గుర్రం దాని వెనుక ఉన్న ఈ చిత్రం సిద్ధార్థుడు పెరిగి పెద్దవాడై వీధిలోకి వచ్చినప్పుడు కనిపించే విషాధ ఘటనలకు అద్దం పడుతుంది. అందుకు అనుగుణంగా ఇంటి వీధి గుమ్మంలా దాని ముందు గుర్రం ఏర్పాటు చేశారు.