సహజ సిద్ధ రంగులతో విభిన్నమైన డిజైన్లలో తయారుచేసే నాణ్యమైన వస్ర్తాలకు ఖ్యాతి మన చేనేత వస్త్ర పరిశ్రమ. ప్రపంచ వస్త్ర పరిశ్రమలోనే ప్రత్యేకతను చాటుతున్న జిల్లా చేనేత పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కనున్నది. పోచంపల్లి వస్త్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఇక్కత్తోపాటు పుట్టపాకకు మాత్రమే పరిమితమైన తెలియా రుమాల్పై ప్రత్యేక పోస్టల్కవర్ను విడుదల చేయనున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. శుక్రవారం పోచంపల్లిలో జరుగనున్న కార్యక్రమంలో వీటిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసింది. దాంతో మన చేనేత వస్త్ర పరిశ్రమకు మరింత విశిష్టతను సంతరించుకోనున్నది.
నల్లగొండ ప్రతినిధి, మే12(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలోనే చేనేత వస్త్ర పరిశ్రమ ప్రత్యేకతను కలిగి ఉంది. సంప్రదాయ పద్ధతులకు అధునాతన డిజైన్లు జోడిస్తూ రంగురంగుల వస్ర్తాలను చేనేత మగ్గాలపై నేయడం నల్లగొండ జిల్లా నేతన్నలకే సాధ్యమవుతూ వస్తున్నది. మరమగ్గాలతో పోటీని తట్టుకుంటూ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా మగ్గాలపైనే అందమైన చేనేత వస్ర్తాలను నాణ్యతతో రూపొందిస్తున్నారు. దాంతో ఇప్పటికే పోచంపల్లి, పుట్టపాక, నారాయణపురం, గట్టుప్పల్, చండూరు, ఎల్లంకి, సిరిపురం లాంటి గ్రామాల్లో కార్మికులు మగ్గాలపై చేనేత వస్ర్తాలను నేస్తూ ఉపాధిని పొందగలుగుతున్నారు.
ప్రధానంగా పోచంపల్లి కేంద్రంగా ఆధునిక పద్ధ్దతులతో నేసే ఇక్కత్ వస్ర్తాలను ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తున్నాయి. దాంతో పోచంపల్లికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. ఇక్కత్ వస్ర్తాలను నేసే క్రమంలో 18 అంకాలు ఉంటాయి. వీటిని అడ్డం, నిలువు డిజైన్లగా వర్ణించే వెప్ట్, వార్ప్ మీద డిజైన్లను రూపొందించి చీరెలను నేస్తారు. 1953లో కర్నాటి అనంతరాములు గుజరాత్లోని బెనారస్ వెళ్లి శిక్షణ తీసుకుని వచ్చి పోచంపల్లిలో ఇక్కత్ వస్ర్తాల నేతకు శ్రీకారం చుట్టారు.
వీటికి ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ ఉండడంతో పోచంపల్లితో పాటు పుట్టపాక తదితర ప్రాంతాల్లో ఇక్కత్ చీరెలను మగ్గాలపై నేయడం ప్రారంభించారు. ఇక్కత్ నుంచి ప్రస్తుతం డబుల్ ఇక్కత్ వస్ర్తాల తయారీకి అప్గ్రేడ్ అయ్యారు. ప్రస్తుతం పుట్టపాక డబుల్ ఇక్కత్ చీరెలు, డ్రెస్ మెటీరియల్ తయారీకి కేంద్రబిందువుగా మారింది. అయితే పోచంపల్లి ఇక్కత్ కళకు 2003లో పేటెంట్ లభించింది. 30 రకాల ఇక్కత్ డిజైన్లకు పేటెంట్ కోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి విజ్ఞప్తి చేస్తే 11 రకాల డిజైన్లకు పేటెంట్ కల్పించారు.
ఇక 2005లో పోచంపల్లి ఇక్కత్కు జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) లభించింది. ఇక ప్రస్తుతం పోచంపల్లి ఇక్కత్కు మరో గౌరవం లభించింది. ఇక్కత్పై పోస్టల్ శాఖ ప్రత్యేకంగా కవర్ను రూపొందించింది. దీన్ని శుక్రవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.పోచంపల్లిలోని టైఅండ్డై అసోసియేషన్ భవనంలో దీన్ని ఆవిష్కరించనున్నారు.
రసాయనాలను వాడకుండా ప్రకృతి సిద్ధ్దమైన రంగులనే వాడుతారు. ఆముదం పొట్టును కాల్చినప్పుడు వచ్చిన బూడిదతో పాటు వృక్షసంబంధిత రంగులను నీళ్లల్లో కలిపి ఆముదం లేదా నువ్వుల నూనెను జతచేసి సూర్యరశ్మి ద్వారా మాత్రమే వేడైన సాధారణ నీటిలో నానబెడుతారు. దీంతో సహజసిద్ధ్దమైన రంగులతో ఉష్ణోగ్రతను నియంత్రించే గుణాన్ని కలిగి నువ్వుల నూనె లాంటి ప్రత్యేక వాసనతో వస్త్రం రూపొందించబడుతుంది. దీన్ని పూర్తిగా అడ్డం, నిలువు నూలుపై ముందే డిజైన్లు రూపొందించిన అనంతరం మగ్గంపై ప్రత్యేకంగా నేస్తారు.
దీని తయారీకి సాధారణ వస్ర్తాల కంటే మూడు, నాలుగు రెట్ల సమయం అధికంగా తీసుకుంటుంది. కేవలం ఎరు పు, తెలుపు, నలుపు రంగులను మాత్రమే ఉపయోగిస్తూ వాటి షేడ్స్తోనే వస్ర్తాన్ని తయారు చేస్తారు. దాంతో పుట్టపాక తెలియారుమాల్ వస్ర్తాలకు ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. పుట్టపాకకు తెలియా రుమాల్ను పరిచయం చేసిన జాతీయ మా స్టర్ వీవర్ గజం గోవర్ధన్కు 2011లోనే చేనేత విభాగంలో మొదటిసారిగా ప్రతిష్టాత్మకమైన ‘పద్మశ్రీ’ అవార్డు లభించింది.
తర్వాత 2013లో ఇదే గ్రామానికి చెందిన గజం అంజయ్యను కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. ఇంకా సంత్కబీర్ లాంటి ఎన్నో పురస్కారాలు గ్రామానికి చెందిన మాస్టర్ వీవర్స్, వీవర్స్ పొంది ఉన్నారు. తాజాగా ఇదే గ్రామానికి చెందిన కొలను రవీందర్ తన తండ్రి కొలను పెద్దవెంకయ్యతో కలిసి 108 విభిన్న డిజైన్లతో రూపొందించిన తెలియా రుమాల్ చీరెకు కూడా జాతీయ అవార్డు లభించింది.
2020లో జియోగ్రాఫిక్ ఇండికేషన్(జీఐ)ను గుర్తింపు సాధించిన పుట్టపాక తెలియా రుమాల్ వస్ర్తానికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కనుంది. పోస్టల్ విభాగం పుట్టపాక తెలియారుమాల్పై ప్రత్యేక కవర్ను ఆవిష్కరించనుంది. శుక్రవారం పోచంపల్లిలో ఇందుకోసం ఏర్పా ట్లు పూర్తి చేశారు. పోస్ట్మాస్టర్ జనరల్ పి. విద్యాసాగర్ రెడ్డి, పద్మశ్రీ గజం గోవర్ధన్, వీవర్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్కుమార్, టి.రమేశ్ తదితరులు ఇందులో పాల్గొననున్నారు.
అందమైన చేనేత పట్టుచీరెలు, వస్ర్తాలకు సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్లు, నాణ్యమైన వస్ర్తాలను నేస్తూ చేనేత పరిశ్రమకు మరింత వన్నె తెస్తున్నారు ఇక్కడి నేతన్నలు. సుమారు నాలుగు దశాబ్దాల కిందటే ఇక్కడికి ఏపీలోని పలు ప్రాంతాల నుంచి చేనేత కార్మికులు వచ్చి వస్ర్తాలను నేస్తున్నారు. ప్రస్తుతం వారంతా ఇక్కడే స్థిరనివాసాలు ఏర్పరుచుకుని చేనేత వస్త్ర పరిశ్రమకు ఆయువుపట్టుగా మారారు. ఇక్కడి మాస్టర్వీవర్లు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పట్టుచీరెలను, డ్రెస్ మెటీరియల్ను తయారు చేయించడంలో మంచి పేరు సంపాదించారు.
దీంతో ఇక్కడి పట్టు చీరెలు, వస్ర్తాలు నిత్యనూతనంగా వర్ధిల్లుతున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడి, కార్మికులు సహజసిద్ధమైన నేతగా చెప్పుకుని తెలియారుమాల్ వస్ర్తాలను సైతం తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని చీరాల ప్రాంతం ఒకప్పుడు తెలియా రుమాల్ వస్ర్తాలకు ప్రసిద్ధి. అయితే పుట్టపాక గ్రామానికి చెందిన గజం గోవర్ధన్ 1975లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చేనేత కార్మికుల సేవా కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు చీరెలను సందర్శించారు.
అక్కడికే ప్రత్యేకమైన తెలియా రుమాల్ తయారీ విధానాన్ని నేర్చుకుని దాన్ని తన స్వగ్రామమైన పుట్టపాకకు పరిచయం చేశారు. పుట్టపాకలో తెలియారుమాల్ వస్ర్తాలను ప్రత్యేకంగా తయారుచేస్తూ దీన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పటికీ ప్రాచీన సహజసిద్ధ్దమైన పద్ధ్దతుల్లో తెలియా రుమల్ వస్ర్తాలను తయారు చేయడంలో పుట్టపాక నేతన్నలు ప్రసిద్ధ్ది చెందారు.
పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తెలియారుమాల్ వస్ర్తాలకు మరో అరుదైన గౌరవం లభించడం ఎంతో సంతోషం. పోస్టల్ శాఖ ప్రత్యేకంగా వీటిపై కవర్ను రూపొందించడం నేతన్నలకే గర్వకారణం. వీటన్నింటిలో మాస్టర్వీవర్గా తాను స్వయంగా పాలుపంచుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. దీన్ని ఎంతో నైపుణ్యం, ఓపికతో శ్రమిస్తే తప్ప నేయడం సాధ్యం కాదు. అలాంటి వస్ర్తాలు మా ఊరిలో తయారు కావడం, దీనికి ప్రపంచ గుర్తింపు రావడం గర్వంగా ఉంది. -పద్మశ్రీ గజం గోవర్ధన్.