సూర్యాపేట టౌన్, మే 12 : సూర్యాపేట జిల్లా కేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరైనట్లు మంత్రి జగదీశ్రెడ్డి వెల్లడించారు. అనుకూలమైన భవనం దొరికితే ఈ సంవత్సరం నుంచే కళాశాల ప్రారంభం కానున్నదని ప్రకటించారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నర్సింగ్ వృత్తికి మరే వృత్తి సాటి రాదన్నారు. దీర్ఘ, స్వల్పకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న రోగులను రక్త సంబంధీకులు సైతం దూరం పెట్టే తరుణంలో ఎన్నో సాదకబాదకాలకు ఓర్చి సేవలందిస్తున్న వారు నర్సులని కొనియాడారు. వైద్యులతో సమానంగా పోటీపడి వైద్యులు వచ్చే సరికి రోగులను సంసిద్ధం చేయడంలో వారికి వారే సాటి అని కితాబిచ్చారు. అటువంటి సేవలందిస్తున్నందునే కొవిడ్ సమయంలో అవార్డు సాధించుకున్నామని గుర్తు చేశారు.
వైద్యరంగంలో కీలకమైన నర్సింగ్ వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఘనత నైటింగేల్ది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో సూర్యాపేటలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా మారిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సేవలు పక్క జిల్లాలకే కాకుండా, పక్క రాష్ర్టాలకూ విస్తరించాయని, అందులో వైద్యులతోపాటు నర్సుల పాత్ర కూడా శ్లాఘనీయమైందని కితాబిచ్చారు. మెడికల్ కళాశాల నూతన భవనాన్ని త్వరలో ప్రారంభించుకోబోతున్నట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలో ఆస్పత్రికి నూతన భవనాన్ని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, డీఎంహెచ్ఓ కోటాచలం, ఆస్పత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శారదాదేవి, వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాండన్ సుదర్శన్, డాక్టర్ కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.