నల్లగొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో తాగుబోతులైన ఇద్దరు పాత నేరస్తుల చేతిలో మహిళ లైంగిక దాడి, హత్యకు గురైన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పూర్తి సాక్ష్యాధారాలతో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి గురువారం మధ్యాహ్నం నల్లగొండకు చేరుకుని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో మహిళ మృతదేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ చేపడుతామని హామీనిచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, సభ్యులు ముషంపల్లి గ్రామంలో బాధిత కుటుంబాన్నిపరామర్శించి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఘటనలో నిందితులుగా ఉన్న ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారిని కఠినంగా శిక్షించాలని పలుచోట్ల ఆర్యవైశ్య, మహిళా సంఘాలు నిరసన తెలిపాయి.
నీలగిరి, సెప్టెంబర్ 23 : ముషంపల్లి మహిళ హత్య కేసు నిందితులను రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. రూరల్ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన మహిళ(54) బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి తమ కిరాణ దుకాణానికి వెళ్తుండగా మార్గమధ్యంలో అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య(38), ఏర్పుజెల్లా శంకర్(29) అలియాస్ పుల్లయ్య మహిళను బలవంతంగా లింగయ్య ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేశారు. ఈ క్రమంలో మహిళ ప్రతిఘటించడంతో తలను నేలకేసి బలంగా కొట్టారు. నోరు, ముక్కు మూసి హత్య చేశారు. స్థానికులు గమనించి ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. టూటౌన్ సీఐ, రూరల్ ఎస్ఐ, క్లూస్ టీం సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితులిద్దరి భార్యలు చాలా రోజుల క్రితమే వీరిని విడిచి వెళ్లారు. ఈ క్రమంలో తాగుడుకు బానిసై తాగిన మైకంలో నేరం చేసినట్లుగా డీఎస్పీ వివరించారు. సమావేశంలో నల్లగొండ టూటౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి, రూరల్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.