పశు సంవర్ధకశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా రాయితీలు ప్రకటించాయి. పలువురికి ఉపాధి కల్పించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలనే ఉద్దేశంతో నేషనల్ లైవ్స్టాక్ మిషన్ (జాతీయ జీవనోత్పత్తుల పథకం) ద్వారా గరిష్టంగా కోటి రూపాయల విలువైన యూనిట్లను 50శాతం రాయితీపై మంజూరు చేస్తున్నాయి. కోళ్లతో పాటు గొర్రెలు, మేకలు, పందుల పెంపకానికి ఆసక్తి, అర్హులైన వారికి అందించేలా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. వ్యక్తిగత, స్వయం సహాయక సంఘాల, ఇతర గ్రూపుల్లో ఉన్న వారు సైతం ఈ పథకానికి అర్హులే. అక్టోబర్ 15వరకు సంబంధిత కార్యాలయంలో దరఖాస్తులు సమర్పిస్తే రాష్ట్రస్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి తొలుత రాయితీలో 50శాతం నిధులు అందించి రెండేండ్ల తర్వాత మిగిలిన 50శాతం బ్యాంకులో జమ చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖలో 50శాతం రాయితీతో నాలుగు పథకాలు అమల్లోకి తీసుకొచ్చింది. కనిష్ఠంగా రూ.50లక్షల నుంచి గరిష్ఠంగా రూ. కోటి వరకు యూనిట్ కాస్ట్తో ఈ స్కీంను అందచేయనుంది. కరోనా అనంతరం అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రాయితీ పథకాలను చేపట్టింది. కోళ్లు పెంచుకోవాలనుకునే వారు 50శాతం సబ్సిడీ పొం దవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంపికైన వారికి వెయ్యి వనరాజ లేదా గ్రామ ప్రియ కోళ్లను అందిస్తారు. ఇది రూ.25లక్షల యూనిట్ కాగా రాయితీ కింద ప్రభుత్వం రూ.12.50లక్షలు ఇవ్వనుండగా లబ్ధిదారులు మరో రూ.50శాతం అంటే రూ.12.50లక్షలు సమకూర్చాల్సి ఉంది.
మేకలు లేదా గొర్రెలు…
లబ్ధిదారుడికి 500 గొర్రెలు లేదా మేకలతో పాటు 25 పొట్టేళ్లు లేదా 25 మేక పోతులు అందిస్తారు. ఈ స్కీం యూనిట్ కాస్ట్ గరిష్టంగా రూ.కోటి ఉండగా 50శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగిలిన 50 శాతం లబ్ధిదారుడు తన వాటా కింద కేటా యించాల్సి ఉంది.
పందులు..
100 ఆడ పందులతో పాటు 25 మగ పందులు అందిస్తారు. యూనిట్ కాస్ట్ రూ.35లక్షలు కాగా 50శాతం సబ్సిడీ ఉంటుంది.
దాణా లేదా పశు గ్రాసం..
పశువులకు మేకలకు దాణాతో పాటు పశుగ్రాసం కావాలను కునే వారికి సైతం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. గరిష్ఠంగా రూ.50 లక్షలు ఈ యూనిట్ కింద అందచేయనున్న ప్రభుత్వం మొదటి ఏడాది 50శాతం రెండో ఏడాది మిగిలిన 50శాతం ఇస్తుంది.
రాష్ట్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక..
వ్యక్తులు లేదా స్వయం సహాయక సంఘాలే గాకుండా ఏదైనా గ్రూపుల్లో ఉన్నవారు సైతం ఈ పథకానికి అర్హులే. ఆసక్తి కలిగిన వారు https://dahd.nic.in అనే వెబ్ సైట్లో దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోని బ్యాంక్ కాన్సెంట్, ఇతర ధ్రువీకరణ పత్రాలతో అక్టోబర్ 15లోగా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో అందించాలి. రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన స్టేట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ అనే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.
ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలి
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులకు 50శాతం రాయితీ పథకాలు అందిస్తున్నాయి. గరిష్ఠంగా రూ.కోటి వరకు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకం యూనిట్లను మంజూరు చేస్తున్నాయి. ఇందులో 50శాతం సబ్సిడీ రూపంలో ఇవ్వనుండగా మిగిలిన 50శాతం బ్యాంకు రుణాలు, లేదా సొంతంగా సమకూర్చుకునే అవకాశం ఉన్నది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మల్లాది వెంకట సుబ్బారావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, నల్లగొండ