నీలగిరి, అక్టోబర్ 20 : కరోనా నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ జోరందుకుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా లక్ష్యంగా సెప్టెంబర్ 16న చేపట్టిన మాస్ వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లాలో 885 ఆవాసాలు, 446 పట్టణాల్లోని మురికి వాడలు, కాలనీల్లో వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తయ్యింది. నల్లగొండ జిల్లాలో 439, సూర్యాపేట 294, యాదాద్రిభువనగిరి జిల్లాలో 159 వైద్య బృందాలు మారుమూల ప్రాంతాలకూ వెళ్లి ఇంటింటినీ పలుకరిస్తూ వ్యాక్సిన్ ఇస్తున్నాయి. పల్లెల్లో ప్రజలు పనులు చేసే ప్రాంతాలకు వెళ్లి మరీ టీకాలు వేస్తుండడంతో లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి.
పైలెట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లా..
మాస్ వ్యాక్సినేషన్లో రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా 4,80,449 మందికి గాను 3,99,567 మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ (83.17శాతం) పూర్తయ్యింది. 1,82,335 మందికి రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో 8,10,752 మందికి గాను 5,32,303 మందికి మొదటి డోసు(65.5 శాతం), 1,63,689 మందికి రెండో డోసు పూర్తయ్యింది. విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా అయినటువంటి నల్లగొండ జిల్లాలో గిరిజన ప్రాంతాలు అధికంగా ఉండడంతో వ్యాక్సినేషన్లో వేగం తక్కువగా కనిపిస్తున్నది. మొత్తం 12, 20,402 మందికి 6,82,639 మందికి(56.5 శాతం) మొదటి డోసు, 2,02,692 మందికి రెండో డోసు వ్యాక్సిన్ పూర్తి చేశారు.
నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకుంటాం..
కరోనా మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆశ కార్యకర్తలు, ఆంగ న్వాడీలు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే సంఖ్యా పరంగా ముందంజలో ఉన్నా జనాభా ఎక్కువగా ఉండడం తక్కువ శాతం చూపిస్తున్నది. నెలాఖ రులోగా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాం.