తిరుమలగిరి, అక్టోబర్ 20 : దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం చేపట్టింది. హుజూరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిశల్లోని నాలుగు దళిత నియోజక వర్గాల్లోని నాలుగు మండలాను ఎంపిక చేసింది. అందులో తిరుమలగిరి మండలం ఒకటి. ఇందులో భాగంగా తిరుమలగిరి మండలానికి రూ.50కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అతి త్వరలో దళితుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు జమకానున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి షరతులు లేకుండా నిధులు ఇవ్వడం గొప్ప విషయమని దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా కేసీఆర్ గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని దళితులు కొనియాడుతున్నారు. పేదరికం తప్ప కులం ప్రధానం కాదని కేసీఆర్ చెప్పిన విషయాలను పలువురు ప్రశంసిస్తున్నారు. దళితులు ఆర్థిక పరిపుష్టి సాధించేలా వారికి అనుకూలమైన వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేసి వ్యాపార రంగాల్లో ఎదిగేలా దళితబంధు ఉపయోగపడనున్నది. రెక్కాడితే గానీ డొక్కాడని దళిత కుటుంబాలకు ఈ పథకం కొండంత అండగా నిలువనున్నది. ఇప్పటికే మండలంలోని అన్ని గ్రామాల్లోని దళితులకు ఈ పథకంపై అధికారులు అవగాహన కల్పించారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కింద తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ తిరుమలగిరి మున్సిపాలిటీలోని తెలంగాణ చౌరస్తా వద్ద బుధవారం దళిత సంఘాలు, టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.