నీళ్లు లేక నెర్రెలు వారిన నేలలు, కరెంటు రాక చీకట్లు అలుముకున్న
బతుకులు, పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు కుప్పై చితిపేర్చిన క్షణాలు.. ఇదీ సమైక్య పాలనలో సాగు దుస్థితి. వ్యవసాయం దండుగ అన్న నేతలను దాటుకుని, బతికి బట్ట కట్టి, దేశానికి పట్టెడన్నం పెడుతున్నది ఉమ్మడి జిల్లా రైతాంగం. స్వరాష్ట్రంలో కృష్ణా జలాల్లో నిక్కచ్చి వాటా, కాళేశ్వర గంగ చూపిన బాట, రైతు బంధు, ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి పథకాలతో ధీమాగా ముందుకు ‘సాగు’తున్నది. 11.50 లక్షల ఎకరాల్లో వరి సాగు, 26లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తున్నది.
ఇలాంటి సమయాన.. పచ్చని
బతుకులపై కొర్రీల కుంపటి పెడుతున్న కేంద్రం మీద రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటుంటే. 60 లక్షల టన్నులకు మించి ధాన్యం కొనలేమనడంపై ఆందోళన చెందుతున్నారు. కేంద్ర సర్కారు వ్యవహార శైలితో వరి ప్రధాన పంటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, సాగు, రైస్ ఇండస్ట్రీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయి.
మా బతుకులను ఆగం జేయొద్దు
గత ప్రభుత్వాల సమయంలో నీళ్లు లేక కరువుతోని అల్లాడినం. ఇప్పుడిప్పుడే కాళేశ్వరం నీళ్లతో వరి సాగు చేస్తున్నం. ఇన్నాళ్లకు మా బతుకులకో దారి దొరికింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం కొనలేమంటూ రైతులను రోడ్డున పడేసే కుట్రలు చెయ్యడం అన్యాయం. కాల్వ కిందయితే వరి పండే భూముల్లో వేరే పంటలు పండవు. రైతులం ఏం కావాలె? మా బతుకులను
ఆగం జేయొద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు రైతులను ఆదుకుంటుంటే, కేంద్రం ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదు.
నాగారం బంగ్లా
గత యాసంగిలో వరి సాగు (ఎకరాల్లో)
నల్లగొండ 4.63లక్షలు
సూర్యాపేట 4.31లక్షలు
యాదాద్రి 2.56లక్షలు
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంజాణ) : యాసంగిలో 60లక్షల టన్నుల బియ్యాన్నే కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఉమ్మడి జిల్లా రైతాంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. వానకాలంలో సన్నరకం, యాసంగిలో దొడ్డు రకం ధాన్యాన్ని సాగు చేయడం అనవాయితీ. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ కొనుగోలు చేస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇక ముందు దొడ్డురకం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని ప్రకటించింది. దీంతో ఆ ప్రభావం వరి సాగు, ధాన్యం దిగుబడిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాపైనే ఎక్కువగా కనిపించనున్నది.
ఉమ్మడి జిల్లాకే అధిక నష్టం…
దొడ్డు బియ్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితుల కారణంగా ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. వచ్చే యాసంగిలోనూ ఉమ్మడి జిల్లా నుంచి కనీసం 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుంది. ఇందులో 12-15 మెట్రిక్ టన్నుల వరకు బియ్యం రానున్నాయి. అంటే కేంద్రం విధించిన పరిమితిలో 25శాతం ఒక్క ఉమ్మడి జిల్లా నుంచే ఉత్పత్తి కానున్నది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచీ కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఇక జిల్లాలోని రైస్ ఇండస్ట్రీలోనూ బాయిల్డ్ రైస్ మిల్లుల పాత్ర కీలకం. ఉమ్మడి జిల్లాలో 150 వరకు పార్బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్నాళ్లుగా దొడ్డు బియ్యంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ తీరుతో ఈ మిల్లులపై ప్రభావం పడనుంది. వీటి ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు దేశంలోనే ప్రసిద్ధి చెందిన మిర్యాలగూడ ప్రాంత లారీ ట్రాన్స్పోర్టు రంగానికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీటిపై ఆధారపడిన సుమారు 5వేల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ తీరుతో రైతులతో పాటు ధాన్యం అనుబంధ రంగాలపైనా తీవ్ర ప్రభావం పడనుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
గణనీయంగా పెరిగిన సేద్యం..
ఉమ్మడి జిల్లాలో సాగు నీటి వనరులు మెరుగయ్యాయి. సూర్యాపేట జిల్లాలో గతంలో కృష్ణా ఆయకట్టు మినహా మిగిలిన ప్రాంతమంతా మెట్ట పంటలు సాగయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు పారుతున్నాయి. యాదాద్రి జిల్లాలోనూ గోదావరి నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక సాగర్లో నీటి వాటాను నిక్కచ్చిగా వినియోగించుకుంటుండంతో ఆయకట్టు చివరి భూములు సైతం సస్యశ్యామలమయ్యాయి. వీటితో పాటు మిషన్ కాకతీయ ఫలితంగా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు పైపైకి వచ్చాయి. వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, రైతుబంధు, బీమా, సబ్సిడీ ఎరువులు-విత్తనాలు, ఊరూరికీ కొనుగోలు కేంద్రాలు సాగు విస్తీర్ణాన్ని పెంచాయి.
రికార్డు స్థాయిలో వరి సాగు, ధాన్యం దిగుబడి..
ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం గత యాసంగిలో రికార్డు స్థాయిలో 11.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నల్లగొండ జిల్లాలో 4.63లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 4.31లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.56లక్షల ఎకరాల్లో గత యాసంగిలో వరి సాగు చేశారు. ఓ వైపు ప్రాజెక్టుల నీళ్లు, మరోవైపు సమృద్ధిగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండడంతో పాటు 24గంటల ఉచిత విద్యుత్తుతో ఒక్క ఎకరా కూడా ఎండిపోలేదు. వీటన్నింటి నేపథ్యంలో 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం కావడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం రైతులను ఆగం చేస్తున్నది
రైతును రాజును చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించి అండగా నిలుస్తుంటే కేంద్రం మాత్రం రైతుల బతుకులను ఆగమాగం చేస్తుంది. ఉన్న నీటి వనరులను బట్టి వరి సాగు చేస్తుంటే దొడ్డు బియ్యం కొనుగోలు చేసేది లేదని ప్రకటనలు చేయడం సరికాదు. రైతుల పట్ల కేంద్రం విధానాలను చూస్తే ఆందోళన కలుగుతుంది. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కేంద్రం విధానాలతో ఇబ్బందులు పడుతున్నరు.
కొర్రీలతో రైతులకు ఇబ్బందులే
దొడ్డు రకాలను కొనలేమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రైతులపై కక్ష సాధింపు చర్యే. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్, రెండు పంటలకు సరిపడా నీరు, రైతుబంధు, రైతుబీమాతో అండగా ఉండి రైతును రాజును చేయాలని చూస్తుంది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నాం అనుకునే లోపు కేంద్రం కొర్రీలను పెట్టి రైతుల బతుకులను బజారున పడేయాలని చూస్తున్నది.
మోదీ పాలనలో రైతులకు అవస్థలు
కేంద్ర ప్రభుత్యం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నది. రెండో సారి అధికారంలోకి రాగానే నూతన చట్టాలను తీసుకొచ్చింది. సబ్సిడీలను ఎత్తి వేస్తూ ఎరువుల ధరలను పెంచింది. దేశ వ్యాప్తంగా ఒకే మార్కెట్ అంటూ కొనుగోలు కేంద్రాలు లేకుండా అవస్థల
పాల్జేసింది. దొడ్డు రకం సాకుతో ధాన్యం కొనేది లేదని చేతులెత్తేయడం సమంజసం కాదు. పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి.
ఆ నిర్ణయం సరికాదు…
దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పడం సరికాదు. సీఎం కేసీఆర్ అన్నదాతల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు సాగు జలాలు అందిస్తూ 60 ఏండ్ల కరువు నేలను సస్యశ్యామలం చేస్తున్నారు. అలాంటిది కేంద్ర సర్కారు దొడ్డు రకం సాగు చేయొద్దని చెప్పడం రైతు వ్యతిరేక విధానమే. కొనుగోలుకు కొర్రీలు పెడితే రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు.
వడ్లు కొనాల్సిందే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ కరువు ప్రాంతం మాది. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల గోదావరి జలాలతో చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత కరెంటు, రైతు బంధు పథకాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేస్తున్నాం. కానీ, కేంద్రం దొడ్డు రకం వడ్లు కొనేది లేదని చెప్పడం దుర్మార్గం. రాష్ర్టాన్ని ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించి వడ్లు కొనుగోలు చేయాలి. లేదంటే కేంద్రంపై ఉద్యమానికి సిద్ధమే.
వడ్లు కొనకపోతే అప్పులే గతి
నేను మూడు ఎకరాల్లో పత్తి వేసిన. నీటి సౌలత్ బాగుండడంతో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. కానీ, ఇప్పుడు కేంద్రం వడ్లు కొనమని కొర్రీలు పెడితే నాలాంటి రైతుల పరిస్థితి అప్పుల ఊబిలో కూరుకుపోవడమే. రాష్ట్రం ఏర్పడ్డంకనే రైతులు కోలుకుంటున్నరు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ పథకాలతోని వ్యవసాయం పండుగలా మారింది. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నడు. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రైతులకు పెద్దముప్పే.
ప్రతి గింజా కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మార్కెట్లకు వచ్చిన ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు రైతుల వద్దకే వెళ్లి కొనుగోళ్లు జరిపి చరిత్ర సృష్టించింది. దీంతో 18.81లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అధికారులు సైతం రికార్డు లిఖించారు. ధాన్యం సేకరణలో గోదాముల సమస్య, సీఎంఆర్లో ఎఫ్సీఐ తాత్సారం చేసినా సరే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.
గందరగోళానికి గురిచేయొద్దు
వరి పండే భూముల్లో ఇతర పంటలు సాధ్యం కాదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తూ రైతులకు చేదోడుగా ఉంటుంటే దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయనే కారణంగా ధాన్యం కొనుగోలు చేసేది లేదని రైతులను కేంద్రం గందరగోళానికి గురి చేస్తున్నది. సాగర్ ఆయకట్టు కింద వరి పంటనే ఎక్కువ పండిస్తున్నరు. కానీ, ఇప్పుడు వద్దంటే లక్షలాది మంది రైతులు నష్టపోతరు. – పసుపులేటి చందర్రావు, రైతు, మేళ్లచెర్వు
రైతు వ్యతిరేక చట్టాలతో భూములు అమ్ముకోవాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న తీరు చాలా బాధాకరం. ఇప్పటికే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నా ఏమీ పట్టించుకోవట్లేదు. మళ్లీ కొత్తగా ‘దొడ్డు వడ్లు కొనం.. పంటలు పండిస్తే మాకు తెలియదు’ అనడం విడ్డూరంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ రైతులకు ఎంతోమేలు చేస్తుంటే ప్రధానమంత్రి మోదీ భూములు అమ్ముకునేటట్లు చేస్తున్నడు. దొడ్డు వడ్లు కొనడంతో పాటు రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేసి న్యాయం చేయాలి.