బొగ్గు బట్టీల కోసం పచ్చని చెట్లు బుగ్గి నిబంధనలకు విరుద్ధంగా వేప, తుమ్మ, కానుగ చెట్ల నరికివేత తిరుమలగిరి మండలంలో 50కిపైగా బట్టీలు నాగపూర్, పూణెకు బొగ్గు తరలింపు పల్లెలపైకి కాలుష్య సెగలు
జిల్లాలో అటవీ శాతాన్ని పెంచేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం హరిత హారంతో మహా యజ్ఞం చేపడుతుంటే, మరోవైపు కొందరు తమ స్వార్థ్ధానికి పచ్చని చెట్లను నిట్టనిలువునా నరికేస్తున్నారు. బొగ్గుబట్టీలకు సర్కారు కంప చెట్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా, నిబంధనలను ఖాతరు చేస్తూ వేప, తుమ్మ, కానుగ చెట్లనూ బుగ్గి చేస్తున్నారు. బొగ్గుగా మార్చి ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తుంగతుర్తి మండలంలో 50కిపైగా వెలిసిన బొగ్గు బట్టీల నిర్వాకమిది.
తిరుమలగిరి, ఆగస్టు 11 : మండలంలో బొగ్గు బట్టీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీనితో పచ్చని చెట్లు బొగ్గుపాలు అవుతున్నాయి. బట్టీల ఏర్పాటుకు గ్రామపంచాయతీ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా బొగ్గుబట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో 50కి పైగా బొగ్గుబట్టీలు వెలిశాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
గ్రామానికి 2 కి.మీ.దూరంలో బొగ్గుబట్టీలు ఏర్పాటు చేయాలి. కానీ, జనావాసాలకు 100 మీటర్ల దూరంలోనే దర్శనమిస్తున్నాయి.
అటవీశాఖ అధికారులు పరిశీలించిన తర్వాతే కలపను కాల్చాలి. అలాగే బొగ్గు రవాణాకు అనుమతి తీసుకొని విక్రయించాలి. కానీ ఇవి ఎక్కడా అమలు కావడం లేదు.
కేవలం కంపచెట్లను మాత్రమే బట్టీలకు విక్రయించాలి. కానీ, యథేచ్ఛగా అన్ని రకాల చెట్లు నరికి బొగ్గుబట్టీలకు వాడుతున్నారు.
బొగ్గు బట్టీల కారణంగా పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉన్నది. వాటి నుంచి వచ్చే పొగతో పల్లెలు కాలుష్యం బారిన పడుతున్నాయి. బట్టీలను జనావాసాలకు దగ్గరలో ఏర్పాటు చేస్తుండటంతో వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళి, పొగతో ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ తదితర వ్యాధులు సోకే అవకాశం ఉంది.
ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వారే ఎక్కువగా బొగ్గు బట్టీలు నిర్వహిస్తున్నారు. తయారైన బొగ్గును ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. నాగపూర్, పుణె లాంటి నగరాలకు తరలిపోతున్నది. బస్తా బొగ్గును రూ.1500 నుంచి 2000 వరకు విక్రయిస్తున్నారు. అనుమతి లేకుండా బొగ్గు మాఫియా వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బొగ్గు బట్టీల నియంత్రణకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై తిరుమలగిరి మండల అటవీ అధికారి నారాయణరావును వివరణ కోరగా.. బొగ్గుబట్టీలపై దృష్టి పెట్టామని, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వారికి జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. సర్కారు, తుమ్మ మినహా ఇతర కలపను వాడితే కేసులు నమోదు చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టింది. పచ్చని చెట్లను నరుకుతున్నాఅధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్లుగా చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అనుమతి లేని బట్టీల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.
-ధరావత్ అశోక్, జేత్యాతండా, రాఘవాపురం
చెట్ల నరికివేతతో పచ్చని పల్లెలు కలుషితమవుతున్నాయి. నిలువడానికి నీడ లేకుండా చేస్తున్నారు. రోడ్ల వెంట, గ్రామాలు, చెరువులు, కుంటల్లోని చెట్లను కూడా వదలడం లేదు. అధికారులు స్పందించి కాలుష్యం కోరల నుంచి గ్రామాలను కాపాడాలి.
-గుగులోతు శ్రీనునాయక్, మామిడాల