
కర్నల్ రమేశ్ కుమార్
నల్లగొండకు చేరిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్
నీలగిరి, సెప్టెంబర్ 9 : యుద్ధంలో ప్రాణాలర్పించి దేశ ప్రజలకు మహోన్నత విజయాలను అందించిన సైనికుల త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని రాష్ట్ర సైనిక సంక్షేమ డైరెక్టర్ కర్నల్ రమేశ్ కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’ జ్యోతికి స్వాగతం పలికిన అనంతరం చిన వెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1971 సంవత్సరం లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించామని, కేవలం 13రోజుల్లోనే పాకిస్తాన్ను మట్టి కరిపించడంతో బంగ్లాదేశ్ ఆవిర్భవించిందన్నారు. విజయం సాధించి 50ఏండ్లు అవుతున్న సందర్భంగా ఈస్ట్రన్ నావెల్ కమాండ్ ఆధ్వర్యంలో 50వ స్వర్ణిమ్ విజయ్ వర్ష్ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా విజయ జ్వాల జిల్లా కేంద్రానికి చేరుకున్నదని తెలిపారు. దుష్ట శక్తులను దేశం నుంచి తరిమికొట్టడంలో సైనిక బలగాలు ఎల్లవేళలా ముందుండి ధైర్యసాహసాలను ప్రదర్శిస్తాయని చెప్పారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ సైనిక దళాల విజయోత్సవాలను ప్రతి భారతీయుడూ ఆస్వాదించాలన్నారు. ఈ సందర్భంగా ఆనాటి యుద్ధంలో పాల్గొన్న సైనికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మక్బూల్ అహ్మద్, డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, నావికా దళ అధికారి వీఎస్సీ రావు, మాజీ సైనికుల సంఘం నాయకులు పాల్గొన్నారు.