చిట్యాల, అక్టోబరు 4 : చిట్యాల పట్టణానికి 800 ఏండ్ల చరిత్ర ఉందని, చిట్యాలలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న ఆలయం 12-13వ శతాబ్దంలో నిర్మించినదని పురావస్తు పరిశోధకుడు, పీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన చిట్యాలలోని ఉరుమడ్ల రోడ్డులో ఎంపీడీఓ కార్యాలయం వెనుక ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని సందర్శించారు. 16 స్తంభాల మండపం, పక్కనే శిథిలాలయంలో ఉన్న స్తంభాలు విరిగిపోయి, పునాదులు పడిపోయి, విరిగిపోయిన శిల్పాలు ఇక్కడి చరిత్రకు అద్దం పడుతున్నాయ పేర్కొన్నారు. భిన్నమైన చెన్నకేశవ, కార్తికేయ సప్తమాతల శిల్పాలను పరిశీలించిన ఆయన ఈ ఆలయ వాస్తు, శిల్ప శైలిని అనుసరించి ఇది 12-13వ శతాబ్దాంలో నిర్మించి ఉంటారని, ప్రధానాలయం కుమారస్వామి ఆలయమని, చెన్నకేశవ స్వామి ఉపాలయం ఉండేదని తెలిపారు. 1253వ సంవత్సరంలో కాకతీయ గణపతి దేవునికి సంబంధించిన శాసనం ఉండేదని, ప్రస్తుతం ఇది మున్సిపాలిటీ కార్యాలయంలో ఉందని అన్నారు. చిట్యాల శాసనం చరిత్ర ప్రాధాన్యత కలగినదని, గణపతిదేవుని గంగసాహిని జారీ చేసిన శాసనం ప్రకారం బ్రహ్మరాక్షస గంగయ ఆయన తాత ధన్వుడు బౌద్ధుడని, అతని కుమారుడు ధసువుడని, ఈ ధసువుడు గుజరాత్లోని ద్వారకా నగరాన్ని పాలిస్తున్న కృష్ణుడికి చిట్టలు అనే గ్రామాన్ని దానం చేశాడని వివరించారు. శ్రీ కృష్ణునికి గ్రామానికి దానం చేయటం పేర్కొనదగ్గ అంశమని శివనాగిరెడ్డి వివరించారు. ప్రాధాన్యత గల ఈ ఆలయా న్ని శిల్పాలను భద్రపరిచి భావితరాలకు అందించాలని ఆయన కోరారు.