
పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన తప్పనిసరి
లేదంటే పంటకు నష్టం
పంటలను ఆశించిన చీడపీడలను నియంత్రించడానికి రైతులు అనేక రకాల పురుగు మందులను పిచికారీ చేస్తుంటారు. అయితే అవి పురుగులకు హాని చేయడమేకాక, పంటలకు మంచి చేసే కీటకాలు, ఇతర జంతుజాలంతోపాటు మనుషులపై కూడా ప్రభావం చూపుతాయి. క్రిమిసంహారక మందులను అవసరం మేరకు, జాగ్రత్తగా వాడకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్రిమిసంహారక మందుల వాడకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. కొన్నిరకాల క్రిమిసంహారక మందులను పిచికారీ చేసిన తరువాత మొక్కలపై కనిపించే ఐదు సాధారణ ప్రభావాలు
ఆకులు మాడడం : ఆకుల చివర్ల గానీ అంచులు గానీ మాడతాయి. ఇవి ఆకులపై మచ్చలు మాదిరిగా కొంతవరకు పరిమితమవ్వడం లేదా ఆకు మొత్తం మాడిపోతాయి. ఒక్కొక్కసారి మొక్క పెరుగుదల ఆగిపోవచ్చు.
మొక్కల కణజాలం చనిపోవడం : మొక్కల్లోని వివిధ భాగాల్లో కణజాలం చనిపోయి, తెగులు సోకినప్పడు వచ్చే మచ్చల మాదిరిగా తుప్పు రంగు మచ్చలు ఏర్పడుతాయి.
ఆకులు పసుపు బారటం : ఆకులపై పసుపు రంగు మచ్చలుగానీ, ఆకు చివర్లు ఎండటంగానీ జరుగుతుంది. కొన్నిసార్లు ఆకంతా ఎండిపోతుంది.
ఆకులు వంకర్లు తిరగడం : ఆకులు ముడుచుకుపోవడం లేదా ఆకులపై బొబ్బలు బొబ్బలుగా రావడం, ఆకులు కప్పు మాదిరిగా అంచుల నుంచి పైకి ముడుచుకుని పోతాయి.
మొక్కలు గిడసబారడం : పెరుగుదల లోపించి మొక్కలు గిడసబారిపోతాయి. సాధారణంగా పిచికారీ మందులను మోతాదుకు మించిగాని, మిశ్రమ మందులు పిచికారీ చేసినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువగా ఈ లక్షణాలు లేత ఆకులపై కనిపిస్తాయి.
నివారణకు ఏం చేయాలంటే..
మొక్కలు తీవ్ర ఒత్తిడితో ఉన్నప్పుడు అంటే అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మి తీవ్రత ఉన్న సమయంలో, తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయరాదు. నీటి ఎద్దడి సమయంలోనూ చేయకూడదు.
పురుగు, తెగుళ్ల మందులను పిచికారీ చేసే సమయంలో అధికారుల సిఫారసు మేరకు తగిన మోతాదు పిచికారీ చేయాలి. పొడిరూపంలో ఉన్న తెగుళ్ల మందును, అరుకు రూపంలో ఉన్న పురుగు మందులు వినియోగించరాదు. ఒకే రూపంలోని మందులను మాత్రమే కలపాలి.
రెండు మూడు రకాల పురుగు మందులు కలిపి పిచికారీ చేయరాదు. పిచికారీ చేయాల్సి వస్తే అధికారులను సంప్రదించి సలహాలు తీసుకున్న తరువాతనే పిచికారీ చేయాలి.
క్రిమి సంహార మందుల మిశ్రమాలను పురుగు, తెగుళ్ల నివారణకు ఒకేసారి పొలంలో వాడాల్సి వస్తే ప్రాథమికంగా వాటిని కలిపి కొన్ని మొక్కలపై 3-4 రోజుల వ్యవధిలో 3-4సార్లు పిచికారీ చేసి వాటి దుష్ప్రభావాలను పరిశీలించాలి. దుష్ప్రభావాలు ఉంటే 18-72 గంటల్లో బయటపడుతాయి.
పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మందుల పిచికారీ సమయంలో అవి శరీరంపై పడకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే రక్షణ దుస్తులు, ముఖానికి మాస్క్ చేతులకి గ్లౌజులు ధరించాలి. పొగ తాగడం, నీరుతాగడం, తినడం చేయరాదు.
పిచికారీకి ముందు స్ప్రేయర్లు కండిషన్లో ఉన్నాయో లేదో గమనించాలి.
మందులను చేతులతో కలుపకూడదు. కర్రను వినియోగించాలి.
గాలి వీచే దిశలోనే మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
స్ప్రేయర్ నాజిల్ను శుభ్రపరిచేటప్పుడు నోటితో గాలి ఊదకూడదు.
ప్రమాదవశాత్తు మందు కళ్లలో పడితే వెంటనే మంచినీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
కీటకనాశిని మందు డబ్బాలను ఖాళీ అయిన వెంటనే గొయ్యితీసి పాతిపెట్టాలి. ఇతర అవసరాలకు వాటిని వినియోగించరాదు.
పిచికారీ పూర్తయిన వెంటనే స్నానంచేసి దుస్తులను శుభ్రపరుచుకోవాలి.
ప్రమాదవశాత్తు విషప్రభావం కలిగితే ప్రాథమిక చికిత్స అందించి వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.
పిచికారీ పూర్తయిన తరువాత స్ప్రేయర్ల ట్యాంకు బయట, లోపల శుభ్రంగా కడిగి వాటి భాగాలకు ఇంజిన్ ఆయిల్ పట్టించి జాగ్రత్త పరుచుకోవాలి.