నీలగిరి, ఫిబ్రవరి 1 : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతన చార్జీల ప్రకారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. మార్కెట్ రేట్లు పెరుగుతున్నట్లు సమాచారం ఉండడంతో జిల్లాలో మూడు రోజులుగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ కొత్త చార్జీలు అమలులోకి వచ్చిన మంగళవారం అమావాస్య కావడంతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు క్రయ, విక్రయదారులు పెద్దగా ముందుకు రాలేదు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడ, నిడమనూర్, దేవరకొండలో రిజిస్ట్రేషన్లు జరుగలేదు. నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 21 డాక్యుమెంట్లకు రూ.1,49,600, చండూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు రిజిస్ట్రేషన్లకు రూ.9 వేలు రాగా.. సూర్యాపేట జిల్లాలో కేవలం మార్టిగేజ్లు మాత్రమే జరగ్గా.. క్రయ, విక్రయాలు జరుగలేదు. హుజూర్నగర్లో 9, కోదాడలో -12, సూర్యాపేటలో -44 చొప్పున 65 డాక్యుమెంట్లకు రూ.65 వేల ఆదాయం వచ్చింది.
రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువలు..
నల్లగొండ జిల్లాలో వ్యవసాయ భూములపై 50 శాతం, వ్యవసాయేతర భూమలుపై 35 శాతం రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఎకరం మార్కెట్ విలువ అత్యల్పంగా రూ.75 వేలు ఉండగా దాన్ని రూ.1,12,500లకు పెంచారు. అత్యధికంగా 10 లక్షలు ఉన్న ఎకరం వ్యవసాయ భూమి విలువను రూ.15 లక్షలకు పెంచారు. 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్న భూములతోపాటు గ్రోత్ ఏరియా ఆధారంగా జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట భూముల విలువ 5 నుంచి 25 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాట్ల ధర (గజం) రూ.500 ఉండగా దాన్ని రూ.750కి పెంచారు. నల్లగొండ జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలో అత్యల్పంగా చిట్యాలలో గజం ధర రూ.2700 కాగా.. అత్యధికంగా మిర్యాలగూడ, నల్లగొండలో రూ.31,725లకు పెంచారు. అయితే నందికొండ మున్సిపాలిటీలో మాత్రం రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
మున్సిపాలిటీల్లో పెరిగిన ధరలు ఇలా
మున్సిపాలిటీ పాత ధర కొత్త ధర
చండూర్ 4250 5738
నకిరేకల్ 5750 7762
దేవరకొండ 10,500 14,175
హాలియా 4,500 6,075
చిట్యాల 2,000 2,700
మిర్యాలగూడ 2,3500 31,725
నల్లగొండ 23,500 31,725