మోత్కూరు, జనవరి 30 : అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు, కుతంత్రాలతో రాష్ర్టాభివృద్ధిని ఆపలేవని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడున్నరేండ్లుగా ప్రజలు, రైతుల కోసం ఒక్క సంక్షేమ పథకమూ అమలు చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆయనకు స్వగ్రామం దత్తప్పగూడెంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్లను గజమాలతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి వేలాది కోట్లు చెల్లించారన్నారు. కేంద్రం మాత్రం రాష్ర్టానికి నిధుల కేటాయింపు చేయడం లేదని, కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం, ఆ పార్టీ ఇక్కడి నాయకులు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నిరంతర విద్యుత్, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం ఇచ్చి అండగా నిలిచారని పేర్కొన్నారు. పనిచేసే వారికి టీఆర్ఎస్ పార్టీలో తప్పక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. దత్తప్పగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాల్కు రూ.10లక్షలు, వెటర్నరీ భవనానికి రూ.10 లక్షలను ఆయిల్ ఫెడ్ సంస్థ ద్వారా కేటాయింపునకు కృషి చేస్తానని హామీఇచ్చారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్లు అశోక్రెడ్డి, పొన్నాల వెంకటేశ్వర్లు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జోసెఫ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, సర్పంచులు ఎలుగు శోభాసోమయ్య, నాగయ్య, ఎంపీటీసీ లక్ష్మణాచారి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పొన్నెబోయిన రమేశ్, ప్రభాకర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోంమల్లు, నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, జిల్లా నాయకులు సంతోష్రెడ్డి, అయోధ్య పాల్గొన్నారు.