కొండకోనల్లో నివాసం.. నాగరిక సమాజానికి దూరం.. పేదరికం వారికి శాపం.. వెరసి అక్షర జ్యోతుల
వెలుగులకు సైతం వారు ఆమడ దూరం. దశాబ్దాల తరబడి గిరిజన తండాల్లో నెలకొన్న పరిస్థితులు ఇవి. భావితరం బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం.. నేడు ఆంగ్ల మాధ్యమం గిరిజన ఆవాసాలకు సైతం విస్తరించింది. ఒకప్పుడు అ,ఆ,ఇ,ఈ వంటి స్వరాలు సైతం వినబడని ఆ తండాల్లో ప్రస్తుతం ఆంగ్ల భాష మార్మోగుతున్నది. ఈ తరహాకు చెందినదే. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధి బాబ్లానాయక్ తండాలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. 2015 సంవత్సరం నుంచే పూర్తి స్థాయిలో అమలవుతున్న ఇంగ్లిష్ మీడియంతో ఇక్కడి విద్యార్థులు అద్భుత ఫలితాలు చవి చూస్తున్నారు. అందివచ్చిన అవకాశంతో గిరిజనులు సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలకు పంపి తమ పిల్లల బతుకుల్ని తీర్చిదిద్దుకుంటున్నారు.
రాష్ట్రం ఏర్పాటైన ఏడున్నరేండ్లలో విద్యాభివృద్ధిలో ఊహించని పురోగతి కనిపిస్తున్నది. అన్ని వర్గాలకూ అందుబాటులోకి వచ్చిన విద్యతో ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నది. ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామీణులకు, పేదలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను ఆరేండ్ల కిందటే అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో గిరిజన తండాల్లోని ప్రభుత్వ పాఠశాలలు అడవి బిడ్డల భవిష్యత్తుకు ప్రాథమిక స్థాయిలోనే బంగారు బాటలు వేస్తున్నాయి. ఇందుకు సాక్షీ
భూతమే తుర్కపల్లి మండలంలోని బాబ్లానాయక్ తండా ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ ప్రతి విద్యార్థిలోనూ చిన్నతనంలోనే ఆంగ్ల విద్య సుగంధం గుబాళిస్తున్నది.
ఇంగ్లిష్ మీడియంతో బడిని బతికించుకున్నారు..
బాబ్లానాయక్ పాఠశాలలోనూ ఒకప్పుడు సమస్యలు కోకొల్లలు. ఇంగ్లిష్ మీడియంపై మోజుతో తండాకు చెందిన చాలామంది తమ పిల్లలను సుదూరంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలకు పంపేవారు. ఆర్థిక భారమైనప్పటికీ వందలు, వేలల్లో ఫీజులు కట్టడానికి సిద్ధపడ్డారు. దాంతో విద్యార్థులు కొరవడి స్థానిక ప్రభుత్వ పాఠశాల మూతబడే పరిస్థితికి చేరింది. అయితే, కాలక్రమంలో తండావాసుల్లో వచ్చిన మార్పు ఫలితంగా సర్కారు బడికి జై అనడానికి ఎంతోకాలం పట్టలేదు. సొంతూరి బడిని బతికించుకుందామన్న భావనతో తండావాసులంతా ఇంగ్లిష్ మీడియం కోసం పట్టుబట్టారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు తీర్మానం చేసి పంపించారు. అనుమతులు వచ్చిన వెంటనే 2015లో ఏకకాలంలోనే ఒకటి, రెండు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. ఏటా అప్గ్రేడ్ చేయడంతో ప్రస్తుతం పాఠశాలలో ఐదు తరగతుల్లోనూ పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న జాలుబాయి, పర్రె బాయి, రామునితండాలకు చెందిన విద్యార్థులు సైతం ఈ పాఠశాలకే వస్తున్నారు. ఒకప్పువు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతానికి 25కి చేరింది. ఇంగ్లిష్ మీడియం లేకుంటే పాఠశాల పరిస్థితి ఇలా ఉండేది కాదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
చదువడం, రాయడంలో ఆరితేరారు..
పాఠశాలలో హెచ్ఎంతోపాటు మరో ఉపాధ్యాయురాలు ఉండగా.. ఆంగ్ల బోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సులువైన పద్ధతుల్లో పాఠాలను బోధించి ఆంగ్లంలో ప్రావీణ్యతను పెంచేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థులు తరగతి గదిలోకి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే వరకూ ఆంగ్లంలోనే సంభాషణ కొనసాగుతున్నది. దాంతో విద్యార్థులంతా ఇంగ్లిష్ చదువడం, రాయడంలో ఆరితేరారు. ఇళ్లకు వెళ్లాక పిల్లలు పుస్తకాలు చూస్తూ అనర్ఘళంగా చదువుతుంటే తల్లిదండ్రులు అచ్చెరువొందుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దంటున్నారు తండావాసులు. ఇక్కడి పాఠశాలలో చదివిన విద్యార్థులు నేడు ఉన్నత చదువుల్లోనూ రాణిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా యూనిఫాం, షూ వంటి వాటిని అమలుచేయడంతోపాటు విద్యార్థుల కోసం కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయడం వల్ల కూడా చాలా మంది ప్రభుత్వ బడివైపే మొగ్గు చూపుతున్నారు.
ఇంగ్లిష్ మీడియంతో మంచి ఫలితాలు
మా పాఠశాలలో ఆంగ్ల విద్యా బోధన విజయవంతంగా కొనసాగుతున్నది. ఇంగ్లిష్ మీడియం అమలైన తర్వాతనే తండావాసులు చాలామంది ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆట పాటలతో పాఠాలు బోధిస్తున్నాం. ఆంగ్ల విద్య బోధనతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంగ్లిష్లో రాయడంతో పాటు
చదువుతున్నారు.
మా ముగ్గురు పిల్లలూ ఇదే స్కూల్లో…
ఇదే పాఠశాలకు నా భార్య ఎస్ఎంసీ చైర్మన్గా ఉంది. ప్రస్తుతం నా చిన్నకూతురు శిరీష ఇదే స్కూల్లో 4వ తరగతి చదువుతున్నది. పెద్ద కూతురు అనూష మోడల్స్కూల్లో 9వ తరగతి, కొడుకు శివ 6వ తరగతి చదువుతున్నారు. వారు కూడా గతంలో ఇదే స్కూల్లో చదువుకున్నవాళ్లే. ఈ స్కూల్ బాగుందనే నా ముగ్గురు పిల్లలనూ ఇక్కడే చేర్పించిన. పై చదువులను కూడా గవర్నమెంట్ బడిలోనే చదివిస్తున్నా.
ఫీజుల బాధ లేకుండా పోయింది…
స్కూల్ పక్కన అంగన్వాడీ బడిలో ఆయాగా పనిచేస్తున్నా. బాగా చదువు చెప్తున్నరని నా ముగ్గురు పిల్లలను ఇదే బడిలో చదివించిన. కొడుకు ప్రవీణ్ బీటెక్ చేస్తున్నడు. పెద్ద కూతురు శ్రీలత ఇంటర్, చిన్న కూతురు గౌతమి 7వ తరగతి చదువుతున్నది. వీళ్లిద్దరూ చదువుతున్నది మోడల్ స్కూళ్లనే. గవర్నమెంట్ బడిలో చదివించడం వల్ల ఫీజుల బాధ తప్పింది.