ములుగురూరల్/ ఏటూరునాగారం/ రేగొండ/ టేకుమట్ల/ మహాముత్తారం/ తాడ్వాయి/ గణపురం/ గోవిందరావుపేట/ వెంకటాపూర్/కాటారం/చిట్యాల/ మొగుళ్లపల్లి, మార్చి 28: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం హోలీ పండుగను ప్రజలు జరుపుకొన్నారు. కరోనా వైరస్ రెండో దశ కొనసాగుతుండడంతో వేడుకలపై సందడి ఎక్కువగా కనిపించలేదు. కొన్ని గ్రామాల్లో సోమవారం హోలీ పండుగ జరుపుకోనున్నారు. ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని దేవగిరిపట్నం, కాసిందేవిపేట, పత్తిపల్లి, కొత్తూరు, సర్వాపురం, మల్లంపల్లి, జాకారం గ్రామాల్లో ప్రజలు హోలీ పండుగను నిర్వహించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి రామాలయం సెంటర్లో మార్వాడీలు కాముడి దహనం చేశారు. సోమవారం హోలీ నిర్వహించనున్నారు. ఏటూరునాగారంలో విద్యార్థులు, యువత వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. రేగొండ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో యువతీ యువకులు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంగులు చల్లకున్నారు. ఎస్సై కృష్ణప్రసాద్గౌడ్, సర్పంచ్ ఏడునూతుల నిషిదర్రెడ్డి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోడెం ఉమేశ్గౌడ్, దాసరి తిరుపతిరెడ్డి, ఇప్పకాయల నర్సయ్య, లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ ఇంగే మహేందర్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. టేకుమట్లలో హోలీ వేడుకల్లో జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గునిగంటి మహేందర్, సర్పంచ్ పోలాల సరోత్తంరెడ్డి, ఎంపీటీసీ ఆది సునీతరఘు, నాయకులు పాల్గొన్నారు. మహాముత్తారం, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపూర్, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో ప్రజలు హోలీ పండుగను జరుపుకొన్నారు. గణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల నాయకులు మోతె కర్ణాకర్రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబురాలు జరుపుకొన్నారు. కాటారం మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కామ దహనం చేశారు.
అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
తాడ్వాయి మండలంలోని ఊరట్టం సమీపంలోని గొత్తికోయగూడెంలో శనివారం రాత్రి అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోలీ నిర్వహించారు. నిట్ 2011 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభయహస్తం ఫౌండేషన్ దత్తత తీసుకున్న గ్రామాల్లో గొత్తికోయలకు స్మైల్కిట్లను పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కార్తీక్ మాట్లాడుతూ గూడెంలో పాఠశాల ఏర్పాటు చేసి ఒక ఉపాధ్యాయుడిని నియమించి పిల్లలకు చదువు చెప్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అభినయ్, సాగర్, సుజిత్, కార్తీక్, చేతన్, రవీందర్, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.